ఇబ్రహీంపట్నం, మే 18 : తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. పేదలు ఇబ్బందులు పడొద్దనే సదుద్దేశంతో ‘అమ్మ ఒడి’ పేరుతో వాహనాలను సమకూర్చింది. దీంతో గర్భిణులు, బాలింతలు ఒక్క ఫోన్ చేస్తే వెంటనే వాహనం ఇంటి వద్దకు వస్తుంది. ఇదివరకు రవాణా సౌకర్యం లేక మాతా, శివు మరణాలు అధికంగా ఉండేవి. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకెళ్లినా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. తల్లీబిడ్డల క్షేమం కోసం అమ్మ ఒడి (102)వాహనాలు సేవలందిస్తుండడంతో పల్లెవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఒడి వాహనాలు దవాఖానకు తీసుకెళ్లడంతో పాటు ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరవేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 11 అమ్మ ఒడి వాహనాలు సేవలందిస్తున్నాయి. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా దవాఖానల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు ఏ క్షణంలో సమస్య వచ్చినా క్షణాల్లో చేరుకుని దవాఖానలకు తరలిస్తున్నాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి తెలిపారు. 2022 జనవరి నుంచి మే 15 వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 2500 మంది గర్భిణులు, బాలింతలకు అమ్మ ఒడి వాహనాలు సేవలు అందించాయని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
గర్భిణులు, బాలింతలకు అమ్మ ఒడి వాహనాలు సేవలందిస్తున్నాయి. ఒక్క ఫోన్కాల్తో ఇంటికి వచ్చి తల్లీబిడ్డలను కాపాడుతున్నాయి. సీఎం కేసీఆర్కు మహిళలమంతా రుణపడి ఉంటాం.
– పల్లె రేణుక, బొంగుళూరు
తల్లీబిడ్డలు సురక్షితం..
అమ్మ ఒడి వాహనాలు గర్భిణులను దవాఖానలకు తీసుకొచ్చి, ప్రసవం అనంతం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్నాయి. 102 వాహనాలకు మరింత ఆదరణ పెరిగింది.
– స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి