కోట్పల్లి, మే 18 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆడబిడ్డల కన్నీటి కష్టాలు కనుమరుగయ్యాయి. నాడు నీటి కోసం బోరుబావుల వద్దకు వెళ్లి నానా ఇబ్బందులు పడుతూ నీళ్లు తెచ్చుకునేవాళ్లు. ఊరికొక్క నీటి బోరింగ్ ఉంటే క్యూలో ఉండి అవస్థలు తీసేవారు. తాగునీటి కోసం కొట్లాటలు సైతం అయ్యేవి. నేడు ఆ కష్టాలకు చెల్లుచీటి పండింది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. సరిపడా నీరు సరఫరా అవుతుండడంతో ఆడబిడ్డలు నట్టింట్లోనే నీటి పట్టుకుని ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో వేసవి కాలం వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం పని మానుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అడపాదడపా ట్యాంకర్లు వస్తే గొడవలు చేసి బిందెడు నీళ్లు తెచ్చుకుంటే గొప్పవిషయంగా ఉండేది. ఇప్పుడు మండు వేసవిలోనూ కావాల్సినన్ని నీళ్లు ఇంట్లోకే వస్తుండడంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. సీఎం కేసీఆర్ తాగు, సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సదుద్దేశంతో మిషన్భగీరథ, మిషన్కాకతీయకు శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలు అమలు కావడంతో జనం జేజేలు పలుకుతున్నారు. తాగునీటి కష్టాలు తీరడంతో పాటు మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు చేయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి నేడు భూగర్భ జలాలు పైపైనే ఉండడం విశేషం.
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత..
పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వానకాలం వచ్చిందంటే బజార్లన్నీ చిత్తడిగా ఉండేవి. నేడు సీసీ రోడ్ల నిర్మాణంతో పల్లెల్లోని ఏ వీధి చూసినా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ప్రతి వీధిలో మురికి కాల్వలు నిర్మించడంతో రోడ్ల వెంట మురుగు నీరు పారే పరిస్థితులకు అడ్డుకట్ట పడింది. నిత్యం పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిని శుభ్రం చేయడంతో పాటు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబం వ్యక్తగత మరుగుదొడ్లను నిర్మించుకోవడంతో స్వచ్ఛ గ్రామాలు దర్శనమిస్తున్నాయి.
నీటి ఇబ్బందులు తీరాయి..
‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ నల్లాలు వేయడంతో నీటి కష్టాలు తీరాయి. గతంలో కుళాయిల వద్ద గంటలకొద్దీ ఉండి నీళ్లు తెచ్చుకునేది. ప్రస్తుతం పుష్కలంగా నీరు సరఫరా అవుతుండడం ఆనందంగా ఉన్నది.
– నర్సమ్మ, కంకణాలపల్లి గ్రామం
ప్రతి గ్రామానికి తాగునీరు..
‘మిషన్ భగీరథ’తో ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నాం. కోట్పల్లి మండలంలోని 21,269 కుటుంబాలతో 21 ఆవాస కేంద్రాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. మండలంలో 17 వాటర్ ట్యాంకులను నిర్మించాం.
– వేణుమాధవ్, మిషన్భగీరథ ఏఈ