సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధించిన అవశేషాలను వెనువెంటనే తొలగించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసింది. 5 రోజుల నుంచే సాగర్లో విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో అప్పటి నుంచి విగ్రహాల అవశేషాలను తొలగించేందుకు వాహనాలు, క్రేన్లను అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం రూ.64 లక్షలతో ప్రత్యేకంగా బడ్జెట్ను సైతం కేటాయించి, అవశేషాల తొలగింపు పనులు చేపట్టనున్నారు.
వీలైనంత త్వరగా తొలగించి ‘క్లీన్ హుస్సేన్సాగర్’గా మార్చేందుకు జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలు, వాటికి సంబంధించిన అవశేషాలు, పూలు, పత్రిని వెనువెంటనే తొలగించనున్నారు. గతేడాది నిమజ్జనం అనంతరం సుమారు 6 వేల మెట్రిక్ టన్నులకు పైగా అవశేషాలను తొలగించామని, ఈసారి సైతం అదే స్థాయిలో తొలగించేందుకు అవసరమైన వాహనాలను, క్రేన్లను పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.