పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3,800 ఇండ్లు మంజూరు కాగా, 1079 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లాకు 6,645 ఇండ్లు మంజూరు కాగా, పట్టణ, పల్లె ప్రాంతాల్లో 2,405 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తైన ఇండ్లల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఇండ్లన్నింటికీ పరిపాలన అనుమతులురాగా, ఆయా దశల్లో మిగిలిన ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎంపిక ప్రక్రియలో ఇండ్లు లేని, కచ్చా గృహాల్లో ఉండే పేదవారికిప్రాధాన్యతనివ్వనున్నారు. అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ పద్ధ్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, త్వరలో పంపిణీ చేసేలా ఉమ్మడి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
– రంగారెడ్డి, మే 5 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మే 5 (నమస్తే తెలంగాణ) : డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హౌసింగ్ ప్రాజెక్టు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా ప్ర భుత్వం ఇండ్లను నిర్మించి వారి సొంతింటి కలను నెరవేరుతున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ పథకాన్ని 2019లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక్కో జిల్లాకు దాని జనాభా, పరిధి, విస్తీర్ణాన్ని బట్టి వేల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. 2024 వరకు లక్షలాది రెండు పడకల ఇండ్లను నిర్మించి నిరుపేదలకు ఇవ్వాలనే లక్ష్యంగా చేపట్టింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోనూ నిరుపేదల కోసం ప్రభు త్వం 6,645 ఇండ్లను మంజూరు చేయగా.. ఆ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని రకాల సౌకర్యాలతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 1812 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 593 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మొత్తంగా 2,405 ఇండ్ల నిర్మాణాలు పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే 192 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయింపు..
జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల ఇండ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రాగా వాటి నిర్మాణాలు నగర పరిధిలోనే జరుగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల పరిధిలో ఉన్న నిర్మాణాలను రంగారెడ్డి జిల్లా అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్లో 1,700 గృహాలు, మహేశ్వరం-బాలాపూర్/మీర్పేటలో 112 గృహాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా వీటిని లబ్ధిదారులకు ఇంకా కేటాయించలేదు. మీర్పేటలో 80 గృహాల నిర్మాణాలు పూర్తి కాగా లబ్ధిదారులకు కేటాయించారు. అదేవిధంగా షాద్నగర్ పరిధిలోని కొత్తూరు-తిమ్మాపూర్లో 60 ఇండ్లు పూర్తి కాగా అందులో 22 గృహాలను లబ్ధిదారులకు అప్పగించారు.
నందిగామ పరిధిలో 120 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా ఇంకా కేటాయింపులు జరుగలేదు. అబ్దుల్లాపూర్మెట్-బండరావిర్యాల పరిధిలో 35, మంచాల పరిధిలోని లింగంపల్లిలో 36, నోములలో 30, మంచాలలో 30 ఇండ్ల నిర్మాణం పూర్తైన ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట-బైరాగిగూడలో 50ఇండ్లు, కిస్మత్పూర్లో 60 ఇండ్లు, శంషాబాద్-హమీదుల్లానగర్లో 20 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. హమీదుల్లానగర్లోని 20 ఇండ్లను అధికారులు లబ్ధిదారులకు ఇప్పటికే కేటాయించారు. శంకర్పల్లి మండలంలోని జన్వాడలో 20 ఇండ్లు పూర్తి కాగా లబ్ధిదారులకు అందజేశారు. మొయినాబాద్ పరిధిలోని అజీజ్నగర్లో 36 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా.. అందులో 34 ఇండ్లను.. మొయినాబాద్ పరిధిలోని సురంగల్లో 16 ఇండ్లు పూర్తి కాగా వాటిని లబ్ధిదారులకు అందజేశారు.
కొనసాగుతున్న నిర్మాణ పనులు..
అన్ని రకాల సౌకర్యాలతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 1,812 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 593 ఇండ్ల నిర్మాణాలు.. మొత్తంగా 2,405 గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సం బంధించి పూర్తి స్థాయిలో నిర్మాణమైన 192 గృహాలను ఇప్పటికే ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో ఇంకా 576 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.
వికారాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): పేదల చిరకాల కల.. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సొంతింటి కల నెరవేరుతున్నది. ఇల్లులేని వారి కోసం రాష్ట్ర సర్కారు చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం పనులు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. యాలాల మండలంలోని కోకట్, కులకచర్ల మండలంలోని అడవివెంకటాపూర్, ధారూర్ మం డల కేంద్రం, మర్పల్లి, మోమిన్పేటలలో చేపట్టిన పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ తుది దశకు చేరిన ఇండ్ల పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని వికారాబాద్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాండూరు పట్టణంలో 401 ఇండ్లు, యాలాల మండలంలోని కోకట్లో 180 ఇండ్లు, ధారూర్ మండల కేంద్రంలో 120, మర్పల్లి మండల కేంద్రంలో 120, పరిగిలో 180, కొడంగల్లో 48, అడవివెంకటాపూర్లో 30 ఇండ్లకు సంబంధించిన పనులు పూర్తి కాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఈ పనుల పూర్తి కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. మరోవైపు కులకచర్ల మండలంలోని అడవివెంకటాపూర్లో నిర్మిస్తున్న 30 ఇండ్లల్లో పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా జిల్లాకు ప్రభుత్వం 3,800 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 2,257 ఇండ్ల పనులు ఆయా దశల్లో సాగుతున్నాయి. కాగా ఇప్పటికే 1,079 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం దాదాపుగా పూర్తైంది.
శరవేగంగా సాగుతున్న పనులు..
జిల్లాకు మంజూరైన రెండు పడకల ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్ పట్టణంలోని 160 ఇండ్లకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా పనులూ ప్రారంభమయ్యాయి. అదేవిధంగా వికారాబాద్ పట్టణంతోపాటు కులకచర్ల మండలంలోని ఇప్పాయిపల్లిలో 10 ఇండ్లకు.. మోమిన్పేట మండలంలోని టేకులపల్లి గ్రామంలో మరో 10 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే పనులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయ గా..అనంతరం ఒక్కో సెగ్మెంట్కు అదనంగా డబుల్ ఇండ్లను మంజూరు చేసింది. తాండూరు నియోజకవర్గానికి అత్యధికంగా ‘డబుల్’ ఇండ్లు మంజూరయ్యాయి. తాండూరు నియోజకవర్గానికి 1500లకుపైగా ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 1001 ఇండ్ల నిర్మాణ పనులు పలు దశల్లో కొనసాగుతున్నాయి.
వికారాబాద్ నియోజకవర్గంలో 526 ఇండ్ల నిర్మాణం పలు దశల్లో ఉన్నది. పరిగి నియోజకవర్గంలో 430 ఇండ్లు.. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 300 ఇండ్ల నిర్మాణం ఆయా దశల్లో కొనసాగుతున్నది. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలానికి సంబంధించి ఇండ్ల నిర్మాణ పనులు ఇంకా షురూ కాలేదు. కాగా ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును గ్రామీణ ప్రాంతా ల్లో యూనిట్ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా యూనిట్ కాస్ట్తోపాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.75వేలను డ్రైనేజీ, నీటి వసతి, మౌలిక వసతుల కోసం ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రభుత్వం ఈ ఇం డ్లను 500 చదరపు గజాల్లో రెండు పడకల గదులు, హాల్, వంటగది ఉండేలా నిర్మిస్తున్నది.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..
జిల్లాలోని ఆయా మండలాల్లో 1,079 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం దాదాపుగా పూర్తైన దృష్ట్యా లబ్ధిదారుల ఎంపికపై అధి కా రులు దృష్టి సారించారు. ఇప్పటికే తాండూరు, పరిగి మున్సిపాలిటీల్లో డబుల్ బెడ్రూంల నిమిత్తం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. తాండూరు మున్సిపాలిటీలో 9,436 దరఖాస్తులురాగా, పరిగి మున్సిపాలిటీలో 1,151 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇండ్ల నిర్మాణం పూర్తైన ఆయా మండలాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నా రు. అయితే ఎంపిక ప్రక్రియలో ఇండ్లు లేని పేదలకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధ్దతిలో పారదర్శ కంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
మరో రెండు నెలల్లో ..
ఇప్పటికే కొన్ని ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా లబ్ధిదారులకు కేటాయించాం. మిగిలిన గృహాల కోసం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక తహసీల్దార్ల ఆధ్వర్యంలో పూర్తైంది. ఇప్పటివరకు 9,704 మంది రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా రు. అందులో 3,208 మంది అర్హులుగా ఉన్నారు. ఇంకా 2,445 గృహా ల కోసం లబ్ధిదారుల పేర్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే ప్రక్రియ నిర్వహించాల్సి ఉన్నది. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నది.
– రాజేశ్వర్ రెడ్డి, డైరెక్టర్, గృహ నిర్మాణ ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లా