ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీఎల్వోలు ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పులను అందజేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులను అందజేసే ప్రక్రియ చురుకుగా సాగుతున్నదన్నారు. ఎండతీవ్రత అధికంగా ఉన్నందున బీఎల్వోలు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఓటర్లకు నేరుగా స్లిప్పులను అందజేయాలన్నారు. ముఖ్యంగా ఓటింగ్ శాతం పెరుగడానికి ఓటర్లకు స్లిప్పులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, తహసీల్దార్ సునీత, బీఎల్వోల సూపర్వైజర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అన్నారు. సోమవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో బూత్ లెవల్ అధికారులతో కలిసి ఓటర్ స్లిప్పులను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఎస్ శ్రీనివాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్క ఓటరుకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటరు స్లిప్పులను తప్పనిసరిగా అందించాలని సెక్టార్ అధికారి, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని కర్ణంగూడ, చర్లపటేల్గూడ, కప్పాడు, తులేకలాన్, ఎలిమినేడు గ్రామాల్లోని పోలింగ్ బూతుల్లో ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్పులను ఆయన బీఎల్వోలతో కలిసి ఇంటింటికీ తిరిగి అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఎల్వోలు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని తుర్కయాంజాల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. మే 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు మున్సిపాలిటీలో సోమవారం ఓటరు స్లిప్పులను సిబ్బందితో కలిసి ఆయన ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటి సిబ్బంది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.