యాచారం, మార్చి 20 : లోక్సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. మండలంలోని జిల్లా సరిహద్దు కేంద్రమైన మాల్ చెక్పోస్టును బుధవారం ఆయన సందర్శించారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న తీరును స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించొద్దన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.50,000ల కంటే మించి నగదును రవాణా చేయరాదన్నారు. ఎక్కువ మొత్తంలో నగదును తీసుకెళ్తే తప్పనిసరిగా రశీదులు చూపించాలన్నారు. లేదంటే డబ్బులను సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అక్రమంగా డబ్బులు, బంగారం, మద్యం రవాణా చేస్తే వాహనాలతో పాటుగా వాటిని సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. నియోజకవర్గ మండలాల్లో మరిన్ని చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ అధికారులు, పోలీసులకు అన్ని విధాలుగా సహకరించాలన్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ శంకర్కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఇబ్రహీంపట్నం : రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచారాలు చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో ఆయన వివిధ రాజకీయ పార్టీలతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా సభలు, సమావేశాలు నిర్వహించటానికి ముందుగానే అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఎంకు చెందిన నాయకులు సామెల్, బోసుపల్లి ప్రతాప్, జిలమోని రవీందర్ పాల్గొన్నారు.