వికారాబాద్ జిల్లాకు మరింత హరితసిరి రాబోతున్నది. జిల్లాలో అర్బన్ పార్కుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో మొత్తం 50 పార్కులను ఏర్పాటు చేసేందుకుగాను జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. తాండూరు మండలం గొట్లపల్లి-అంతారం రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటుకు ఇప్పటికే అనుమతులు మంజూరుకాగా పనులు జరుగుతున్నాయి.
కొడంగల్ నియోజకవర్గంలోని అప్పాయిపల్లి అటవీ ప్రాంతం, బొంరాసుపేట్ అటవీ ప్రాంతం, పరిగి నియోజకవర్గంలోని జాఫర్పల్లి ఫారెస్ట్, వికారాబాద్లోని అనంతగిరి అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కుల ఏర్పాటుకుగాను ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది. వీటికి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రతి అర్బన్ పార్కును 100-120 ఎకరాల్లో రూ.కోటిన్నర నిధులతో ఏర్పాటు చేయనున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వంటి వసతులతోపాటు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు.
-వికారాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 13, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఐదు అర్బన్ పార్కులను ఏర్పాటు కానున్నాయి. జిల్లాలోని కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో అర్బన్ పార్కులను ఏర్పాటు చేసేందుకుగాను ప్రతిపాదించారు. తాండూరు నియోజకవర్గంలో తాండూరు మండలం గొట్లపల్లి-అంతారం రిజర్వ్ ఫారెస్ట్లో అర్బన్పార్కు ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలకు అనుమతులు మంజూరుకాగా, పనులు జరుగుతున్నాయి.
మిగతా కొడంగల్ నియోజకవర్గంలోని అప్పాయిపల్లి అటవీ ప్రాంతం, బొంరాసుపేట్, పరిగి నియోజకవర్గంలోని జాఫర్పల్లి ఫారెస్ట్, వికారాబాద్లోని అనంతగిరి అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కుల ఏర్పాటుకుగాను ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. సంబంధిత నాలుగు అర్బన్ పార్కుల ఏర్పాటుకుగాను ఇప్పటికే జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలను అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. అర్బన్ పార్కుల ప్రతిపాదనలకు అనుమతులు జారీ అయిన వెంటనే పనులు ప్రారంభించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
మరోవైపు ప్రతి అర్బన్ పార్కును 100-120 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి అర్బన్ పార్కు ఏర్పాటుకుగాను కోటిన్నర నిధులను ఖర్చు చేయనున్నారు. అర్బన్ పార్కుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అర్బన్ పార్కులను ఏర్పాటు చేయనున్న ఆయా అటవీ ప్రాంతాల్లో ఔషధ మొక్కలు, మూలిక మొక్కలు, అలంకార మొక్కలతోపాటు తదితర మొక్కలను నాటనున్నారు.
తాండూరు పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. తాండూరు పట్టణానికి చుట్టు పక్కల వందల సంఖ్యల్లో ఉన్న నాపరాతి, సిమెంట్ పరిశ్రమలతో వెలువడే అధిక కాలుష్యానికి కళ్లెం వేసేందుకు అర్బన్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అనుమతులు జారీకాగా, పనులు జరుగుతున్నాయి. తాండూరు పట్టణానికి 4 కిలోమీటర్ల సమీపంలోని గొట్లపల్లి అంతారం అటవీ ప్రాంతంలో పట్టణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాండూరు నుంచి జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట వెళ్లే దారిలోని గొట్లపల్లి అంతారం రిజర్వ్ ఫారెస్ట్లోని 120 ఎకరాల్లో అర్బన్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించారు.
సంబంధిత ఉద్యానవనంలో కాలుష్యాన్ని నియంత్రించే ఔషధ మొక్కలతోపాటు మూలిక మొక్కలు, అలంకార మొక్కలతోపాటు తదితర మొక్కలతో కూడిన ఉద్యానవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునే పరికరాలు, అడ్వంచెరల్ ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. రాశివనం, నక్షత్ర వనాలను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. మొత్తం రూ.కోటిన్నర నిధులతో అర్బన్పార్కు పనులకు సంబంధించి జోరుగా సాగుతున్నాయి. 45 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న అర్బన్పార్కు చుట్టూ ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాండూరు మండలంలోని గొట్లపల్లి-అంతారం అర్బన్పార్కు పనులు ఇప్పటివరకు 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
జిల్లాలో ఐదు అర్బన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను అందజేశామని, ఇప్పటికే తాండూరు మండలం గొట్లపల్లి-అంతారం ఫారెస్ట్లో అర్బన్ పార్కు ఏర్పాటుకు అనుమతులు మంజూరుకాగా ఇప్పటివరకు 50 శాతంమేర పనులు పూర్తయ్యాయి. అనంతగిరి, జాఫర్పల్లి, అప్పాయిపల్లి, బొంరాసుపేట అటవీ ప్రాంతాల్లో అర్బన్ పార్కుల ఏర్పాటుకుగాను అనుమతులు వచ్చిన పనులు ప్రారంభిస్తాం.
-జ్ఞానేశ్వర్, జిల్లా అటవీ శాఖ అధికారి