బీఆర్ఎస్ హయాంలోనే రంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతితో జిల్లా స్వరూపమే మారిందన్నారు. వెనుకబడిన గ్రామాల అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పిస్తుండడంతో పలు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్ర సర్కార్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రంగారెడ్డిజిల్లాకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం శాస్తా గార్డెన్లో జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. ఎమ్మెల్యే మంచిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో అనేక పేరుపొందిన సంస్థలు ఏర్పాటయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఔటర్ రింగ్రోడ్డు, నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారి, బెంగళూరు-హైదరాబాద్ రహదారి, విజయవాడ-హైదరాబాద్ రహదారి, రహదారులకిరువైపులా అనేక ప్రముఖ కంపెనీలు ఏర్పాటయ్యాయని, అలాగే, మరిన్ని కంపెనీల ఏర్పాటుకు అంతర్జాతీయస్థాయి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని ఆయన తెలిపారు.
కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ, కొంగరకలాన్లోని కలెక్టర్రేట్ సమీపంలో ఫాక్స్కాన్ కంపెనీ వంటి సంస్థలు వస్తుండటంతో జిల్లా స్వరూపమే మారిందన్నారు. మండలంలోని ఎలిమినేడు గ్రామంలో 600 ఎకరాల్లో మరిన్ని సంస్థలు రానున్నాయని, మంచాల మండలంలోని జాపాల-రంగాపూర్ నక్షత్ర కళాశాల వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, తాళ్లపల్లిగూడలో 400 ఎకరాల్లో మరిన్ని సంస్థలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. వెనుకబడిన గ్రామాలాభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. ఫార్మాసిటీ, ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
కేడర్ను కాపాడేవారే లీడర్
పార్టీ రేడర్ను కాపాడుకోవడంతో పాటు వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కృషిచేసినప్పుడే నాయకులుగా గుర్తింపు లభిస్తుందన్నారు. కిందిస్థాయి కేడర్ సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత గ్రామ, వార్డు కమిటీలపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు సమష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ నెల 15లోగా అన్ని వార్డుల కమిటీ అధ్యక్షులు వార్డుల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేసి ప్రజల సమస్యలను తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తాగునీరు, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీలతోపాటు అనేక మౌలిక వసతులు కల్పించామన్నారు. మున్సిపాలిటీల్లో జీవో 58, 59 ద్వారా ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నందున అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మున్సిపాలిటీల ఏర్పాటుతో శివారు ప్రాంతాల సత్వర అభివృద్ధి
హైదరాబాద్ శివారుల్లోని రంగారెడ్డిజిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే కిషన్రెడ్డి తెలిపారు. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేయడం కోసం ఇటీవల మంత్రి కేటీఆర్ను కలిసి ఒక్కొక్క మున్సిపాలిటీకి రూ.10కోట్లు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు మంగ, శ్వేత, మమత, పద్మ, శ్రీలత, సుజాత, సుధాకర్, జగన్, ప్రసన్న, భానుబాబు, జ్యోతి, సుల్తాన్, బాలరాజు, ఉప్పరిగూడ సహకార సంఘం వైస్ చైర్మన్ శంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జగదీశ్యాదవ్, మహేశ్గౌడ్, అరవింద్, అంజిరెడ్డి, రాములు, రాజు, రాజ్కుమార్, శివసాయి, శేఖర్గౌడ్, ముజాకిర్, రవీందర్, చిన్నా, గోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణప్ప పాల్గొన్నారు.
బీజీపీ, కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్లు రాష్ట్రంలో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ప్రభుత్వంపై కుట్రతోనే బండి సంజయ్ తన అనుచరులతో పేపర్లను లీక్ చేయించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని, ఈ విషయాన్ని ఇంటలిజెంట్ శాఖ గుర్తించి తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలను మానుకోవాలన్నారు.
కష్టపడి పనిచేసేవారికి సముచిత స్థానం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటివారని, కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేండ్లలో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరందించి మహిళల తాగునీటి కష్టాలు తీర్చిందన్నారు. ముఖ్యంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిచిందని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండటం కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయని, ఈ సమ్మేళనాలు కార్యకర్తలు మనస్సువిప్పి మాట్లాడుకునే అవకాశాలు కూడా ఇస్తున్నాయని తెలిపారు.