దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించారు. రంగారెడ్డి జిల్లాలో 689 మంది, వికారాబాద్ జిల్లాలో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రస్తుతం లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడంతోపాటు యూనిట్ల ఎంపిక ప్రక్రియను ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ముమ్మరం చేశారు. త్వరలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున డబ్బులు జమ కానుండడంతో ఈలోపే యూనిట్ల్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డబ్బులు జమైన తరువాత గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు. రూ.10 లక్షల్లో నుంచి రూ.10 వేలతో రక్షణ నిధిని ఏర్పాటు చేయనున్నారు. లబ్ధిదారులకు వ్యాపారంలోగాని ఇతరత్రా ఏదైనా కష్టమొచ్చినప్పుడు ఆదుకునేందుకుగాను ఈ డబ్బులను వినియోగించనున్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, ఫిబ్రవరి 11 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు ప్రక్రియ వేగవంతమైంది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక వారం రోజుల క్రితమే పూర్తికావడంతోపాటు పరిశీలన ప్రక్రియ, లబ్ధిదారుల వారీగా బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది. యూనిట్ల ఎంపిక ప్రక్రియతోపాటు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. దళిత బంధు పథకం లబ్ధిదారులకు అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. ప్రతి లబ్ధిదారుకు రూ.10లక్షలు ఒకేసారి గ్రాంటుగా అందిస్తున్న బృహత్తర పథకం దళిత బంధు కింద ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 358 మంది లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేసి వారి జాబితాను సంబంధిత నోడల్ అధికారులకు అందజేశారు.
జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో 100, తాండూరులో 100, పరిగిలోని నాలుగు మండలాల్లో 80, కొడంగల్లోని మూడు మండలాల్లో 60, చేవెళ్లలోని నవాబుపేట మండలంలో 18 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 698 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. జిల్లాలో షాద్నగర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, మహేశ్వరంలో 100, చేవెళ్లలో 82, ఇబ్రహీంపట్నంలో 100, ఎల్బీనగర్లో 81, కల్వకుర్తిలో 63, రాజేంద్రనగర్లో 100 మంది, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 72 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల జాబితాను ఆయా నియోజకవర్గాల నోడల్ ఆఫీసర్లకు అందజేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి డీఆర్డీవో, పరిగి నియోజకవర్గానికి జడ్పీ సీఈవో, వికారాబాద్ నియోజకవర్గానికి జిల్లా ఏవో, తాండూరు నియోజకవర్గానికి జిల్లా పంచాయతీ అధికారి నోడల్ ఆఫీసర్లుగా నియమించగా జిల్లా మొత్తం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పర్యవేక్షిస్తున్నారు. లబ్ధిదారుల కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, ఇతరవాటిని అధికారుల బృందం పరిశీలించింది.
దళిత బంధు కింద లబ్ధిదారులు ఎంపిక చేసే యూనిట్లు తప్పనిసరిగా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఉండాలన్నది ఈ అవగాహన సదస్సుల లక్ష్యం. తాము ఎంపిక చేసుకున్న యూనిట్లను లబ్ధిదారులు సూచించినా, ఆయా ప్రాంతాల్లో వాటి సాధ్యాసాధ్యాలు, వ్యాపారాభివృద్ధి, ఆదాయం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయించడానికి సదస్సులు ఏర్పాటు చేశారు. ఒక కుటుంబంలో యజమాని ఒకటి, వారి పిల్లలు ఇతర యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉన్నది. నలుగురైదుగురు కలిసి పెద్ద వ్యాపారం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు సైతం ఉండడంతో దానిపై అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం పలు యూనిట్లను సూచించినా తుది నిర్ణయం లబ్ధిదారులదే.
దళిత బంధు కింద ఎంపికైన లబ్ధిదారులు తాము ఏర్పాటు చేయబోయే యూనిట్ను ఇప్పటికే సూచించినా మరోసారి వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రతి రెండు మండలాలకు ఒక దగ్గర అవగాహన సదస్సులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. శుక్రవారం వికారాబాద్, నవాబుపేట్, కోట్పల్లి, బంట్వారం, మర్పల్లి, మోమిన్పేట్లకు సంబంధించిన అవగాహన సదస్సులు జరిగాయి. శనివారం తాండూరు, పెద్దేముల్ మండలాలు, తాండూరు మున్సిపల్కు సంబంధించి తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో, బషీరాబాద్, యాలాల మండలాలకు సంబంధించి బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో, కొడంగల్, దౌల్తాబాద్ మండలాలు, కొడంగల్ మున్సిపాలిటీలకు సంబంధించి కొడంగల్ ఎం పీడీవో కార్యాలయంలో, ఈ నెల 14న పరిగి మండలం, మున్సిపాలిటీ, పూడూరు మండలాల లబ్ధిదారులకు పరిగి ఎంపీడీవో కార్యాలయంలో, దోమ, కులకచర్ల, చౌడాపూర్ మండలాలవారికి కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో, ధారూరు, బొంరాస్పేట్ మండలాల లబ్ధిదారులకు బొంరాస్పేట్ ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన సదస్సులు జరుగనున్నాయి. మండలస్థాయిలో రిసోర్స్ టీం సభ్యు లు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయాధికారి, ఐకేపీ ఏపీఎంలు ఈ టీం సభ్యు లు. మండలస్థాయిలో అవగాహన తర్వాత ప్రతి నియోజకవర్గంవారీగా ఎమ్మెల్యేలు, నోడల్ అధికారులతో కలిసి అవగాహన కల్పిస్తారు.
లబ్ధిదారుల ఎంపిక, పరిశీలన, బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ పూర్తికాగా యూనిట్ల ఎంపిక ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభు త్వం డబ్బులను జమ చేసేలోపు యూనిట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, రూ.10లక్షల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిన అనంతరం గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలవారీగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించి పరిశీలన ప్రక్రియలో భాగంగా యూనిట్ల ఎంపికకు సంబంధించి చర్చించగా, ఒక్కో లబ్ధిదారుడు ఐదు యూనిట్లను ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎక్కువగా వాహనాల కొనుగోలుపైనే లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న స్కీంలపై నిపుణులతో అవగాహన కల్పించనున్నారు. అవగాహన క్యాంపుల అనంతరం లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను అధికారులు ఫైనల్ చేయనున్నారు. మినీడెయిరీలను కూడా పెట్టేలా జిల్లా యంత్రాంగం కూడా లబ్ధిదారులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయం, అనుబంధ పథకాల్లో పందిరి కూరగాయల సాగు, వరినాటు వేసే యంత్రాలు, పవర్ టిల్లర్, మినీ డెయిరీ, ట్రాక్టర్, ట్రాలీ, కోడిపిల్లల పెంపకం, ఆటో ట్రాలీ ఉన్నాయి. ట్రాన్స్పోర్టు రంగంలో మూడు చక్రాల ఆటో ట్రాలీ(సరుకుల రవాణా), నాలుగు చక్రాల ఆటో(ప్రయాణికులు లేదా సరుకు రవాణా), ఆటో(ఏడు గురు కూర్చునే సామర్థ్యం గలది), ఉత్పత్తి రంగాల్లో మట్టి ఇటుకల తయారీ, ఆటో ట్రాలీ, ఆయిల్మిల్, వెట్ గ్రైండర్, బియ్యం, పిండి, పసుపు, కారం మిల్లులు, సిమెంటు ఇటుకలు, రింగుల తయారీ, ఫ్రీ కాస్టింగ్ గోడలు, ఆటో ట్రాలీ, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రాలు, ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్, రిటైల్ రంగంలో మినీ సూపర్ బజార్, ఎలక్ట్రికల్ షాప్, మోటార్ వైండింగ్, బ్యాటరీ సేవలు, మెడికల్, జనరల్ స్టోర్, హార్డ్వేర్, శానిటరీ దుకాణంతోపాటు ఆటో ట్రాలీ, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణం, యక్రలిక్ షీట్లు, టైల్స్ వ్యాపారం, వ్యవసాయ సాగు కోసం యంత్ర పరికరాల విక్రయాలు, సేవల రంగంలో హోటల్, క్యాటరింగ్ సర్వీసుతోపాటు ఆటో ట్రాలీ, టెంట్హౌస్, డెకరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టంతోపాటు ఆటో ట్రాలీ, డీటీపీ, మీ సేవ, సీఎస్సీ, ఆన్లైన్ సర్వీస్ సెంటర్, ఫొటో స్టూడియో, డయాగ్నస్టిక్ ల్యాబ్, మెడికల్ షాప్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవేకాకుండా లబ్ధిదారులకు ఇష్టమైనవి, ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించే యూనిట్లు నెలకొల్పుకోవడానికి అవకాశం ఉన్నది. ఇవేకాకుండా తమ ప్రాంతంలో ఏ యూనిట్ నెలకొల్పుకుంటామనేది లబ్ధిదారుల అంగీకారంతో డీఆర్డీఏ ఏపీఎం నిర్ణయిస్తారు. అవగాహన సదస్సుల తర్వాత యూనిట్లను గ్రౌండ్ చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తారు.
దళిత బంధు పథకం అమలు ప్రక్రియలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, పరిశీలన ప్రక్రియ, బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియ కొనసాగుతున్నది. అదేవిధంగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసేలోగా యూనిట్స్ ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులను ఆదేశించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 7లోగా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాం.