ఇబ్రహీంపట్నం : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో సాగుచేసిన వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఈ నెల 20న సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్ధం, చావుడప్పులుతో రోడ్లపైకి వచ్చి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించే విధంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ రోడ్లపైకి ఉదయం 10గంటల లోపే చేరుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలన్నారు. ఈ
నిరసన సెగ కేంద్ర ప్రభుత్వానికి తాకే విధంగా ఉండాలని ఆయన సూచించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక మాట చెబితే రాష్ట్రంలోని గల్లీ లీడర్లు మరో మాట మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వర్షాకాలం వరిధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేంతవరకు కేంద్రంలో పోరాటం ఆగదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రం నష్టాల ఊబిలోకి కూరుకుపోతుందన్నారు. రైతులను నట్టేట ముంచేందుకు ఇక్కడి బీజేపీ నాయకులు అసత్య పదజాలంతో పబ్బం గడుపుతున్నారని ఇది సరైన పద్దతి కాదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 20న పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామన్నారు.
నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లోని అన్ని గ్రామాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం పండించిన వరిధాన్యం సాగుచేస్తుంటే అదిచూసీ ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేఖ విధానాలు అవలంభించడం సరైన పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో రైతులు సాగుచేసిన వరిని కొనుగోలు చేసేంతవరకు ఉధ్యమిస్తామన్నారు.