Kerala Woman : దేశాలు, సంస్కృతులు వేరైనా ప్రేమ వారిని ఒక్కటి చేసింది. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు (Scotland MP), కేరళ మహిళ (Kerala Woman) ఒకరినొకరు ఇష్టపడ్డారు. తొమ్మిదేళ్ల క్రితం యూకే చట్టం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. అయితే కేరళలోని గురువాయుర్ టెంపుల్ (Guruvayur Temple) లో ఇద్దరం మళ్లీ పెళ్లిచేసుకుందామని ఆమె అప్పట్లో కోరింది. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్నడూ వీలుపడలేదు. ఎట్టకేలకు తాజాగా ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వారు మళ్లీ వివాహం చేసుకున్నారు.
బంధుమిత్రుల సమక్షంలో గత మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళలోని ఎర్నాకుళం జిల్లా పిరవోమ్ ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్ తాజా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితమే యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లో చట్టబద్ధంగా వివాహమైంది. అయితే గురువాయూర్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలన్నది నిధిన్ చిరకాల కోరిక. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది.
ఈ వేడుకకు నిధిన్ 22 ఏళ్ల కుమారుడు వేదిక్ శంకర్తోపాటు ఇరుకుటుంబాల సభ్యులు హాజరయ్యారు. వీరి ప్రేమకథ 2016లో యూకేలో మొదలైంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన నిధిన్, ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ కోసం 2008లో యూకే వెళ్లారు. ఆ తర్వాత పీహెచ్డీ పూర్తిచేశారు. అయితే ఆ సమయంలో విదేశీ విద్యార్థులను ప్రభావితం చేసేలా యూకే ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. దాంతో వీసా రద్దయిన నిధిన్ ఈ విషయంపై పార్లమెంటరీ కమిటీల ముందు తన వాదనను బలంగా వినిపించారు.
ఆ సమయంలోనే స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) తరఫున యూకే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మార్టిన్ డేతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2016 ఫిబ్రవరిలో మొదలైన వీరి స్నేహం రెండు నెలలకే ప్రేమగా మారింది. మార్టిన్ ఆమెకు ప్రపోజ్ చేశారు. అప్పటికే విడాకులు తీసుకుని 12 ఏళ్ల కుమారుడి బాధ్యత చూసుకుంటున్న నిధిన్ మొదట సంశయించారు. పైగా ఉద్యోగం, వీసా కూడా లేకపోవడంతో వెనకడుగు వేశారు. కానీ మార్టిన్ ఆమెకు అండగా నిలిచారు. తన తల్లిదండ్రులకు పరిచయం చేయగా, వారు కూడా నిధిన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు.
తొమ్మిదేళ్ల క్రితం యూకేలో వీరి వివాహం రిజిస్టర్ అయినప్పటికీ, గురువాయూర్లో పెళ్లి చేసుకోవాలనే కోరిక మాత్రం మిగిలిపోయింది. ఆ తర్వాత మార్టిన్ 2018, 2019, 2023లో కేరళకు వచ్చినా.. వరదలు, కరోనా మహమ్మారి, కుటుంబసభ్యుల అనారోగ్యం వంటి కారణాలతో ఆలయ సందర్శన సాధ్యపడలేదు. నాలుగోసారి పర్యటనలో భాగంగా ఎట్టకేలకు నిధిన్ కలను మార్టిన్ నెరవేర్చారు. ప్రస్తుతం నిధిన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తుండగా, ఆమె కుమారుడు వేదిక్ ఎడిన్బర్గ్లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా స్థిరపడ్డారు. మార్టిన్ డే మూడుసార్లు యూకే ఎంపీగా, ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు.