యాచారం : డబ్బులివ్వాలని కాంట్రాక్టర్ను బెదిరించిన ఇద్దరు నకిలీ పోలీసులను గురువారం యాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం వివరాలు.. నల్లొండ జిల్లా మరిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన సిద్దగోని వెంకటేశ్ ప్రస్తుతం నాగోల్, బండ్లగూడలోని అజయ్నగర్కాలనీలో నివసిస్తున్నాడు. అతడు సామాజిక తెలంగాణ, క్యూ న్యూస్ చానల్లో నకిలీ విలేకరిగా.. అదేవిధంగా నల్లొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ మోదీన్పాషా భారత్టుడేలో నకిలీ విలేకరిగా చెలామణి అవుతున్నారు. వీరిద్దరు ఈనెల 16న మండలంలోని మొగుళ్లవంపు గ్రామ సమీపంలో తిరుమల ఇన్ప్రో డెవలపర్స్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్ను కారులో సందర్శించారు.
ఈ వెంచర్లో చింతపల్లి మండలం వీటీనగర్కు చెందిన కొమ్మరాజుల రవి కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. అతడి వద్దకు వెంకటేశ్, మోదీన్పాషా వెళ్లి తాము నల్గొండ ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చామని, స్పెషల్ బ్రాంచ్ పోలీసులమంటూ చెప్పుకున్నారు. గతంలో నీపై చింతపల్లి పీఎస్లో గంజాయి తాగినట్లు కేసులున్నాయని, నిన్ను బైండోవర్ చేస్తున్నామని బెదిరించారు. రూ.లక్ష ఇస్తే కేసు నుంచి తప్పిస్తామన్నారు. అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని యాచారం పరిసర ప్రాంతాల్లో రెండు గంటలకు పైగా చక్కర్లు కొట్టారు. యాచా రం పోలీస్స్టేషన్ ముందుకు తీసుకొచ్చి కారును ఆపి లక్షకు బదులుగా రూ.60,000 ఇవ్వాలని, వెంటనే డబ్బులు ఫోన్పే ద్వారా చెల్లించాలని బెదిరించి తిరిగి అతడిని వెంచర్ వద్ద వదిలిపెట్టి వెళ్లారు.
భయాందోళనకు గురైన రవి యాచారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేశారు. నిందితులు ఇచ్చిన ఫోన్పే నంబర్ ఆధారంగా విచారణ జరపగా కాంట్రాక్టర్ను సిద్దగోని వెంకటేశ్, షేక్ మోదీన్ పాషా బెదిరించినట్లు తేలింది. దీంతో ఇరువురిని అరెస్టు చేసి వెంకటేశ్ నుంచి స్విప్ట్ కారు, వీవో మొబైల్ ఫోన్ను, మోదీన్ పాషా నుంచి వీవో ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించినందుకు సీఐ లింగయ్య, ఎస్ఐలు ప్రభాకర్, పద్మయ్య, కానిస్టేబుళ్లు సుబ్బరాజు, మల్లేశ్, రాఘవేందర్, రాజు, ఇంతియాజ్లను ఏసీపీ బాలకృష్ణారెడ్డి అభినందించారు.