– ప్రభుత్వానికి టీఎస్ యూటీఎఫ్ హెచ్చరిక
ఎర్రుపాలెం, జూలై 29 : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) ఖమ్మం జిల్లా కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. బుధవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మండల అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నండ్రు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గురుకుల విద్యా వ్యవస్థ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేక సేవా, పరిపాలనా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకుల ఉపాధ్యాయుల బదిలీలను తక్షణమే నిర్వహించి, కేడరీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, 010 హెడ్ ద్వారా జీతాల చెల్లింపు విధానాన్ని వెంటనే అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కేర్ టేకర్ల నియామకం, ఉపాధ్యాయులకు వృత్త్యంతర శిక్షణ, పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు, 317 జీవో కారణంగా ఏర్పడిన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయుల సంక్షేమాన్ని విస్మరించడం వల్ల గురుకుల విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, విద్యా ప్రమాణాల పరిరక్షణ కోసం ముందుగా ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ ఎర్రుపాలెం మండల ఉపాధ్యక్షులు నీలం సైదారావు, పీడీ నాగేశ్వరరావు, సుబ్బరామరాజు, సత్యనారాయణ, జీవన్ గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.