ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో వరుణార్చన, వరుణదేవుడికి అభిషేకం, పెద్ద చెరువులో హోమం కార్యక్రమాన్ని డిసెంబర్ 1న కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 22న నిర్వహించాలని తలపెట్టిన కార్యక్రమంలో వరుసగా నాలుగైదు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా వాయిదా వేశామన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1న ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు వేదపండితులైన బ్రహ్మణోత్తములు, ఋత్వికులతో ఈ మహాహోమం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదేండ్ల క్రితం వర్షాల కోసం మహా వరుణయాగం నిర్వహించిన స్థలంలోనే చెరువులు నిండినందున ఈ అభిషేకం, హోమం నిర్వహించ తలపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ మహాయాగం, వరుణార్చన అభిషేకం కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లోని భక్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అన్నిరాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున పాల్గొని వరుణ దేవుడికి అభిషేకం చేసి, హోమంలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
ఈ మహా హోమం కార్యక్రమానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే యాగానికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర నాయకులు ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో పూర్తయినట్లు తెలిపారు.