షాద్నగర్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022లో భాగంగా జాబిత సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలతో తుది ఓటరు జాబితాను నవంబర్ 1న ప్రచురించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో సంబధిత అధికారులతో మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఓటర్ల ఫిర్యాదులు, ఇతర ఆక్షేపనలు ఉంటే నవంబర్ 30లోపు దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించాలని చెప్పారు.
అభ్యంతరాల పరిష్కారం అనంతరం వచ్చె ఏడాది జనవరి 5న మరోమారు తుది జాబితాను విడుదల చేసి అందుబాటులో ఉంచాలని చెప్పారు. 18 ఏండ్లు నిండిన వారి నుంచి ఓటర్ నమోదుకు దరఖాస్తులు కోరి, ఓటు హక్కును కల్పించాలని చెప్పారు. ఓటరు నమోదు పక్రియపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.