Telangana | వికారాబాద్. ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేనివిధంగా జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరిగింది. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లను కూడా నిర్మించి రోడ్ల అభివృద్ధికి నిధులిచ్చారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలోనూ సీసీ రోడ్లను నిర్మించారు. రోడ్ల మరమ్మతులకు తొమ్మిదేండ్లలో జిల్లాకు రూ.256 కోట్లపైనే నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను నిర్మించారు. సమైక్య పాలనలో జిల్లాలోని అత్యధిక గ్రామాలకు రోడ్లులేని పరిస్థితి ఉండేది. అరకొర నిధులను మాత్రమే కేటాయించేవారు, కనీసం రోడ్డ మరమ్మతేలకు కూడా నిధులివ్వని దుస్థితి ఉండడంతో గుంతల రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ కేసీఆర్ ఏడేండ్లలో సీసీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లతో జిల్లాలో రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించారు.
ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.560 కోట్లు
కొత్త రోడ్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను మంజూరు చేసింది. నాలుగు లేన్ల రోడ్లతోపాటు రహదారుల మరమ్మతులకు, రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుకు పెంచడం, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు, సింగిల్ లేన్-రెండు లేన్ల రోడ్లకు, బ్రిడ్జిల నిర్మాణానికి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను విడుదల చేసింది. జిల్లాలో నాలుగు లేన్ల రోడ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ నుంచి బీజాపూర్ నాలుగు లేన్ల రోడ్డు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆర్అండ్బీ కొత్త రోడ్లలో తాండూరు బైపాస్ రోడ్డుకు రూ.80 కోట్లు, వికారాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.28 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్అండ్బీ రహదారుల నిర్మాణాలకు, మరమ్మతులకు రూ.560 కోట్లపైనే నిధులను మంజూరు చేయడం గమనార్హం. జిల్లాలో 2014 నుంచి ఇప్పటివరకు కొత్తగా నిర్మించిన ఆర్అండ్బీ రోడ్లకు సంబంధించి.. పరిగి-నంచర్ల, సుల్తాన్పూర్-బాసుపల్లి వరకు 22.60 కిలోమీటర్ల రోడ్డును రూ.31.50 కోట్లు, శంకర్పల్లి-మర్పల్లి రోడ్డు నిర్మాణానికి రూ.12.24 కోట్లు, వికారాబాద్-తాండూర్ వరకు 28.90 కిలోమీటర్ల రోడ్డుకు రూ.52.20 కోట్లు, నాగసముందర్-బంట్వారం, ధారూరు నుంచి కోట్పల్లి వరకు 20.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.31.50 కోట్లు, తాండూరు నుంచి తొర్మామిడి వరకు 19.76 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు నిధులను కొత్త రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులిచ్చింది.
రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత
– మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ భారీగా నిధులు విడుదల చేశారు. జిల్లాలోని ఆర్అండ్బీ రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చింది. గతంలో ఏడాదికి రూ.2-3 కోట్ల నిధులతోనే సరిపెట్టేవారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి గ్రామాలకు లింక్ రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి గ్రామపంచాయతీలో సీసీ రోడ్లను నిర్మించారు.