షాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహానీయులు చేసిన త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగం జనవరి 26, 1950 అమలులోకి వచ్చిన నాటి నుంచి మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను క్రింది స్థాయి ప్రజల వరకు అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
అదే విధంగా హైదారాబాద్ డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం నాంపల్లిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్, అసిస్టెంట్ కలెక్టర్ ఐఏఎస్ కదివరన్ ఫలనీ, డీఆర్వో హరిప్రియ, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.