యాచారం : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సాహించడంతో ఫలితంగా మంచి ఉపాధి పొందుతున్నారు. మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండటంతో మత్స్యకారులకు చేపలు సిరులు కురిపిస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనూ తగిన జీవనోపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మండలంలోని కుర్మిద్ద గ్రామంలో గల పెద్దచెరువు, మేడిపల్లి ఊరచెరువు, సాలి చెరువుల వద్ద జోరుగా చేపలు పడుతున్నారు. పెరిగిన చేపలను పట్టి ప్రజలకు చెరువు వద్దనే విక్రయిస్తున్నారు. సొసైటీలకు ప్రభుత్వం మోటర్ సైకిళ్లు, వలలు, ఐస్ బాక్సులు, జీవితబీమా వసతులను కల్పించిన విషయం తెలిసిందే.
గతంలో చెరువుల్లో వేసిన చేపపిల్లలు ప్రస్తుతం పెరిగి పెద్ద కావడంతో ఒక్కసారిగా చేపల పంట పండింది. చేపలను విక్రయించడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు చేపల విక్రయాలతో తగిన జీవనోపాధి పొందుతున్నారు. మండలంలోని చింతపట్ల లక్ష్మణ చెరువు గత 24 సంవత్సరాల తరువాత నిండటంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి 2లక్షల చేపపిల్లలను చెరువులో వదిలారు. దీంతో చేపల దిగుమతి లేకుండానే తాజా చేపలు తక్కువ ధరలకు స్థానికంగా లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.