షాద్నగర్ : దేశంలోని ఏ రాష్ట్రంలో కూడ లేని విధంగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్నా ఏకకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఫ్లీనరి, టీఆర్ఎస్ ఆవిర్భావించి 20యేండ్లు అయిన సందర్భంగా వరంగల్లో వచ్చె నెల 15న నిర్వహించే బహిరంగ సభ నిర్వాహణపై షాద్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని, నూతన పథకాలకు శ్రీకారంచుట్టిన ఘనత మనకే దక్కుతుందన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయవల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.
పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రతి కుటుంబానికి రక్షణగా ఉంటామని చెప్పారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఫ్లీనరి సమావేశం, వరంగల్ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ వంటి అంశాలపై చర్చించారు. ఫ్లీనరి సమావేశానికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిస్తారని, అదే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక పాసులను జారీ చేస్తారని చెప్పారు. వరంగల్ సభకు ప్రజలను తరలించేందుకు ప్రతి గ్రామానికి బస్సులను పంపుతామని వివరించారు. షాద్నగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్నఅభివృద్ధి పనులు, త్వరలో ప్రారంభించే పనులపై సుమారు 20నిమిషాల పాటు స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో చర్చించారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, కొత్తూరు మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్యాదవ్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, శ్రీలత, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, మధుసుదన్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్నాయక్, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, మురళీధర్రెడ్డి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.