కేశంపేట : కేశంపేట మండలం మంగళగూడెంలోని రైతులకు చెందిన లేగదూడలపై చిరుత పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా గ్రామంలోని రైతులకు సంబంధించిన లేగదూడలు, దుడ్డెలను వరుసగా చిరుత చంపి తింటోంది. రైతులు తమ పశువులను వ్యవసాయ పొలాల్లోని పశువుల కొట్టాల్లో రాత్రి కట్టేసి వస్తే తెల్లారే వరకు లేగదూడలు, దుడ్డెలు దారుణంగా చంపబడుతున్నాయి. లేగదూడలను చంపి సగం మేరా శరీరాన్ని తిని మిగతా భాగాన్ని వదిలేసి వెళుతోంది చిరుత. దీంతో గ్రామంలోని రైతులు భయాందోళనలకు గురువుతూ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. మంగళగూడెం గ్రామానికి అనుకుని కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో అడవిప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు గ్రామానికి చెందిన కొట్టం అశోక్రెడ్డి, కొట్టం కృష్ణారెడ్డి, కొట్టం శంకర్రెడ్డి, చుక్క శేఖర్గౌడ్, చుక్క బుచ్చయ్యగౌడ్, కొట్టం అరవిందరెడ్డి, చుక్క రాంచంద్రయ్యగౌడ్లకు సంబంధించిన 10కి పైగా లేగదూడలను చిరుత చంపింది. గురువారం రాత్రి చుక్క శేఖర్గౌడ్, చుక్క బుచ్చయ్యగౌడ్ల లేగదూడలపై దాడి చేసి చంపింది. శుక్రవారం గ్రామ రైతులు సంబందిత ఫారెస్టు అధికారులు, కేశంపేట పోలీసులకు ఈ సంఘటనలపై సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. చిరుతను బంధించేందుకు రెండు రోజుల్లో ఫారెస్టులో బోన్లను ఏర్పాటు చేస్తామని ఫారెస్టు అధికా రులు తెలిపారు. సంబంధిత అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.