షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్తి కాకపోయేదని.. కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వకున్న పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అనంతరం ట్రాక్టర్, ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయనం రూ. 50వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో రైతన్న కళ్లలో సంతోషం కనిపిస్తుందన్నారు. తెలంగాణలో రైతు సంబురాలు చేసుకుంటుంటే కేంద్రంలో రైతులను చంపుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో నల్లా చట్టాలు తెస్తే ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో రైతులు ధర్నా చేస్తే ప్రధాని పట్టించుకోలేదన్నారు.
సీఎం కేసీఆర్ దేశ రైతుల తరుపున ధర్నా చేస్తే కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. 8విడతలుగా రూ. 50వేల కోట్ల రైతుబంధు డబ్బులు 60లక్షల మంది రైతులకు అందించడం జరిగిందన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన రైతుల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ను విడదీయలేరన్నారు. లక్ష కోట్లతో మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైందని చెప్పారు. నేడు 43లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.