షాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ల కాలంలోనే ఊహించని అభివృద్ధి చెందిందని కండ్లు మండిన బీజేపీ ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చి రైతంగాన్ని ఇబ్బందులు పెడుతుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ పిలుపు మేరకు చేవెళ్లలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఎంపీ రంజిత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి బీజేపీ డౌన్…డౌన్…అంటూ పెద్ద ఎత్తున నినదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ మన బతుకు మనం బతుకుంటే కేంద్రానికి ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా వరి పండించడం లేదన్నారు.
దేశం మొత్తంలా నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే పండిస్తున్నారు.. అవి పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మాత్రమే రైతులు వరిపంట పండించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో పంజాబ్ కంటే అత్యధికంగా వరి పండిస్తున్నారని, దీనికి కండ్లు మండిన బీజేపీ కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. వానకాలం పంట కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనేందుకు ఎందుకు వెనకడుగు వేస్తుందో చెప్పాలన్నారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతదేశాన్ని మేమే కాపాడుతామని ప్రగల్భాలు పలకడం సరికాదన్నారు.
భేషరత్తుగా కేంద్ర ప్రభుత్వం వరి ధ్యానం కోనుగోలు చేయాలి
ఆమనగల్లు : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా భేషరతుగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల కేంద్రాల్లో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. రైతు ధర్నాకు ఆయా మండలాల్లో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గులలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై చూపుతున్న వివక్షతను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయకపోతే టీఆర్ఎస్ తరపునా ఆందోళనను విస్తృతం చేస్తామని హెచ్చరించారు.
వరిధాన్యం కొనుగోలు చేసేంతవరకు పోరాటం ఆగదు..
ఇబ్రహీంపట్నం : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలను తిప్పికొడతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజవకర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగం, ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండించిన వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
షాద్నగర్లో మూడు గంటలపాటు రైతుల ధర్నా
షాద్నగర్ : దేశంలోని సర్కార్ సంస్థలను అమ్మడంపై ఉన్న ద్యాస రైతుల శ్రేయస్సుపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులను బలోపేతం చేసే విధంగా వ్యవసాయ చట్టాలను రూపొందించిన మోదీ ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనడంపై ఎందుకు సోయి లేదని దుయ్యబట్టారు. రైతులను ఇబ్బందుల పాలుచేసే ఏ ప్రభుత్వమైనా నిలిచినట్ల చరిత్రలో లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన టీఆర్ఎస్ రైతు మహా ధర్నాలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధాన్యాన్ని కొనాల్సిన ఉన్నప్పటికీ, ఆ పార్టీ నేతలే తెలంగాణలో నిరసనలు తెలుపడం హస్యాస్పదమన్నారు.