Rythu Bandhu | షాబాద్, జనవరి 21 : ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలు పెట్టుబడి డబ్బుల కోసం అవస్థలు పడొద్దనే ఉద్దేశంతో ఓ రైతుబిడ్డగా, రైతుల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి 2023 యాసంగి, వానకాలం సీజన్ వరకు అదునుకు ముందుగానే రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం జమ చేశారు. దీంతో రైతులు పంటలకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి ధైర్యంగా వివిధ రకాల పంటలను సాగు చేసుకునేవారు.
ప్రస్తుతం రైతులకు మళ్లీ పెట్టుబడి సాయం మొదలైంది. కానీ యాసంగి సీజన్కు పంటలు సాగు చేసుకోవాల్సిన రైతులకు రైతు బంధు డబ్బులు అందకపోవడంతో ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు. గత నెలన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కాకుండా రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అది, ఇది ఏదీ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, కల్వకుర్తి(ఆమనగల్లు), మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఈ ఏడాది యాసంగి సీజన్కు 4.04.436 మంది రైతుల ఖాతాల్లో రూ.378.92కోట్లు నిధులు జమ చేయాల్సి ఉండగా, గత నెలలో ప్రారంభమైన పెట్టుబడి సాయం ఇప్పటివరకు రెండు ఎకరాల లోపు ఉన్న 1.60.139 మంది రైతుల ఖాతాల్లో రూ.53.80కోట్లు మాత్రమే ప్రభుత్వం జమ చేసింది.
అదునుకు పంట పెట్టుబడి అందకపోతే పంటలు సాగు చేసుకోవడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు అడుగంటుతున్న భూగర్భజలాలతోపాటు సాయంత్రం 5 గంటలకు కరెంట్ కూడా కట్ చేస్తుండడంతో పంటల సాగుపై రైతులు ఆలోచనలో పడ్డారు. బోరుబావుల కింద వరినార్లు, కూరగాయల పంటలు సాగు చేసుకునేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచిన రైతులు పెట్టుబడి సాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
గత ప్రభుత్వం అదునుకు ముందుగానే పెట్టుబడి సాయం అందించడంతో ఎవరి వద్ద అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకునేవాళ్లమని అన్నదాతలు పేర్కొన్నారు. కొత్తగా ఇచ్చే రైతు భరోసా పథకం దేవుడెరుగు కానీ.. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు పథకమైనా అందిస్తే తమ కష్టాలు తప్పుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పంట పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. దీంతో ఏడాదిలో రెండు విడుతలు ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేసింది. పెద్ద, చిన్న తేడా లేకుండా రైతులందరికీ అప్పటి ప్రభుత్వం డబ్బులు అందించింది. గత వానకాలంలో వర్షాలు సరిగ్గా కురువకపోవడంతో బోరుబావుల్లో నీటిమట్టం కూడా గణనీయంగా తగ్గిపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల నిరంతర కరెంట్ సరఫరా అయ్యేది. ప్రస్తుతం సాయంత్రం 5 అయ్యిందంటే వ్యవసాయానికి కరెంట్ కట్ చేస్తున్నారు.
మళ్లీ 5, 6 గంటల తర్వాత అర్దరాత్రి కరెంట్ ఇస్తున్నారు. రోజుకిస్తున్న 17-18 గంటల కరెంట్లో అనేకసార్లు అంతరాయం కలుగుతున్నదని రైతులు చెబుతున్నారు. ఓ వైపు పంట పెట్టుబడి, మరో వైపు అడుగంటుతున్న భూగర్భజలాలు, కరెంట్ కోతలతో యాసంగి సాగు ఎలా చేయాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ముందుగా వరి నార్లు పోసిన ప్రాంతాల్లో నార్లు ముదురుతున్నాయి. పంట పెట్టుబడి సాయం రైతులందరికీ వెంటనే అందించాలని, కరెంట్ కోతలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
యాసంగి సాగు చేసేందుకు పంట పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నాను. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో రెండు ఎకరాలు వరి పంట సాగు చేసేందుకు వరి నారు పోసి సిద్ధంగా ఉంచాను. రైతు బంధు డబ్బులు వస్తే ఎరువులు కొనడానికి, కూలీలకు ఉపయోగపడుతాయని అనుకుంటే ఇప్పటివరకు నాకు డబ్బులు రాలేదు. కేసీఆర్ హయాంలో రైతులకు అదునుకు పంట పెట్టుబడి డబ్బులు అందించడంతో సంతోషంగా వ్యవసాయం చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రైతులకు లాగోడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం వెంటనే రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమచేయాలి.
– పి. కృష్ణ, రైతు, కుమ్మరిగూడ(షాబాద్)
పంటల సాగు కోసం ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు బంధు డబ్బులు ఇప్పటికీ రాలేదు. మా నాన్న పేరుపై ఆరు ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వ హయాంలో వానకాలం, యాసంగి పంటలకు ముందుగానే రైతు బంధు డబ్బులు బ్యాంకులో జమయ్యేవి. వాటితో ఎరువులు, విత్తనాలు కోనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుతం వరిపంటతోపాటు, కూరగాయలు, పూలు సాగు చేస్తున్నాను. ప్రభుత్వం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకే ఇప్పటివరకు పంట సాయం అందించింది. పెట్టుబడి సాయం అదునుకు అందితే తిప్పలు తప్పుతాయి. ఇప్పటివరకు డబ్బులు రాకపోవడంతో అప్పు తెచ్చి ఎరువులు కొని పంటలు సాగు చేయాల్సిందే. ప్రభుత్వం మిగతా రైతులకు కూడా వెంటనే రైతు బంధు డబ్బులు అందించాలి.
– పి. గోపాల్, రైతు, హైతాబాద్(షాబాద్)