న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 8: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు చోట్ల బుధ, గురువారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి చెరువులు, వాగులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి అక్కడక్కడా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి పంట పొలాలు మునిగిపోయాయి. మత్స్యకారులు చెరువుల వద్ద చేపలు పట్టారు. ఈ వర్షాలతో పంటలకు మేలు చేకూరడంతో పాటు భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశముందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.