ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు రంగారెడ్డి జిల్లా అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేయగా.. మరో వారం రోజుల్లో జీవో 59 దరఖాస్తుల పరిశీలననూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీవో 59 కింద జిల్లావ్యాప్తంగా 13,230 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన జూన్ 2, 2014 కటాఫ్ తేదీని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఆస్తిపన్ను చలాన్, విద్యుత్, నీటి బిల్లులు తదితర ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. అదేవిధంగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలం ప్రభుత్వ అభ్యంతరకర భూముల జాబితాలో ఉన్నదా, లేదా అన్న విషయంపై కూడా విచారణ చేపట్టనున్నారు. అన్ని పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఆమోదం, లేదంటే తిరస్కరించనున్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుదారులు స్థల విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరను చెల్లించి క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది.
రంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే జీవో 59 దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో ఇప్పటికే సమావేశం నిర్వహిం చి, పరిశీలనకు సంబంధించి పలు సూచనలు అధికారులకు జారీ చేసినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే దరఖాస్తుల వారీ గా ఇంటింటికెళ్లి పరిశీలన ప్రక్రియను పూర్తి చేశా రు. అదేవిధంగా జీవో 59 కింద జిల్లాలో 13,230 దరఖాస్తులు రాగా ప్రత్యేక బృందాల తో వెరిఫికేషన్ చేయనున్నారు. 2014 జూన్ 2వ తేదీలోపు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లను మాత్రమే క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీని పరిగణనలోకి తీసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో నిర్మాణాలను బట్టి దరఖాస్తులను తిరస్కరించడమా.. ఆమోదించడమో అధికారులు చేయనున్నారు.
జీవో 59 కింద 13,230 దరఖాస్తులు..
జిల్లాలో జీవో 59 కింద 13,230 దరఖాస్తులు వచ్చాయి. 2016లో క్రమబద్ధ్దీకరణకు అవకాశమిచ్చిన ప్రభుత్వం మరోసారి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే మే నెలలో జీవో 58 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టగా, జూన్ నెలాఖరుకు పూర్తయ్యింది. అంతేకాకుండా సంబంధిత దరఖాస్తుల పరిశీలన వివరాలను నేరుగా ఆన్లైన్లోనే జిల్లా రెవెన్యూ అధికారులు ఎంట్రీ చేశారు. అయితే జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులను కూడా జిల్లాలో ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. 125 గజాలకు మించి ఉన్న ఇండ్ల స్థలాలకు సంబంధించి కనీస ధరను ప్రభుత్వానికి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు 50 శాతం మేర ఇండ్లను నిర్మించి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే 250 గజాల్లోపు ఇంటిని నిర్మించుకున్నట్లయితే 50 శాతం కనీస ధరను, 251-500 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటే 75 శాతం కనీస ధరను, 500-1000 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వానికి కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. అదేవిధంగా జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను చలాన్లు, విద్యుత్, నీటి బిల్లులను పరిశీలించనున్నారు. అదేవిధంగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలం ప్రభుత్వ అభ్యంతరకర భూముల జాబితా(అసైన్డ్ భూములు, మిలిటరీ-కంటోన్మెంట్, రిజర్వ్ ఫారెస్ట్ భూ ములు, కోర్టు కేసులు, ఖాళీ స్థలం, మెట్రోరైల్కు కేటాయించిన స్థలం, కుంట, శిఖం భూములు, ఎఫ్టీఎల్, భూదాన్, పట్టా, దేవాదాయ, వక్ఫ్, డిఫెన్స్, వైకుంఠధామం భూములు)లో ఉందా లేదా అనేది పరిగణనలోకి తీసుకొని అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు.