వికారాబాద్, మే 21: ఉపాధి హామీ, హరితహారం పనుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపా ధి హామీ, హరితహారం పనులపై డీఆర్డీవోతో కలిసి ఆమె డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, ఈసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు జిల్లాలో పల్లెనిద్ర చేసి ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఖాతాలను ఓపెన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలను గ్రూపులుగా ఏర్పాటు చేసి రెండు రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలన్నారు. పల్లె నిద్రలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా గ్రామాల్లో ఉండి ఈ నెల 23 లోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, లేకపోతే సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉపాధి హామీ కూలీలకు సమయానికి డబ్బులు చెల్లించాలని సూచించారు. ప్రతి సోమ, గురువారాల్లో ఉపాధి హామీపై డీఆర్డీవో సమక్షంలో సమీక్ష ఉంటుందని, మాస్టర్ జాబితాలతో అధికారులు హాజరు కావాలని ఆమె ఆదేశించారు. కంప్యూటర్ ఆపరేటర్ల కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ-పంచాయతీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేందు కు కలెక్టరేట్లోనే కంప్యూటర్లను ఏర్పాటు చేసి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో ను ఆదేశించారు. అదేవిధంగా నీటి నిల్వ కుంటల తవ్వకానికి సంబంధించిన అంచనాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్కు అధిక ప్రాధాన్యమివ్వాలని.. అన్ని గ్రామ పంచాయతీల్లో 200 గుంతలను తవ్వి సిద్ధంగా ఉంచాలన్నారు. ఎక్కడ పను లు జరుగుతున్నాయో అక్కడ తప్పనిసరిగా బోర్డులను ఏర్పాటు చేయాలని.. పనులు జరిగే ప్రాంతాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కలెక్టర్ నిఖిల తెలిపారు.