పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలను ఆర్జించవచ్చని ఉద్యానవన సెరికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుందని, ఏడాదిలో నాలుగు నుంచి ఐదు పంటలు తీయవచ్చని వివరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఈసారి 300 ఎకరాల్లో మల్బరీ సాగు విస్తీర్ణం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 221 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టి పట్టు పురుగులను పెంచుతున్నారు. మల్బరీ సాగు చేసే రైతులకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహాన్ని సైతం అందిస్తున్నది. సబ్సిడీపై పరికరాలు, షెడ్ల నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నది. పట్టు పురుగుల పెంపకం చాలా తేలికైందని, కుటుంబ సభ్యులు కలిసి చేసుకుంటే చక్కటి ఆదాయ మార్గమని అధికారులు సూచిస్తున్నారు.
పరిగి, మే 14 : తక్కువ సమయంలో మంచి ఆదాయం వచ్చే పట్టు పురుగుల పెంపకానికి సర్కారు ప్రోత్సాహం అందిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఈసారి 300 ఎకరాల్లో మల్బరీ సాగు పెంచేలా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. జిల్లా పరిధిలో ప్రస్తుతం 150 మంది రైతులు 221 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టి పట్టు పురుగుల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. సంవత్సరానికి లక్షన్నర రూపాయలు ఆదాయం వచ్చే పట్టు పురుగుల పెంపకం మేలని ఉద్యానవన, సెరికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మల్బరీ సాగుకు షెడ్, సెల్స్ సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నది. ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా సబ్సిడీ అందించేందుకు సిద్ధంగా ఉండడంతో మల్బరీ సాగు ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పవచ్చు. జిల్లా పరిధిలో సాగు చేస్తున్న వారిలో చాలామంది రైతులు తమకు ఉన్న పొలంలో ఒకటి, రెండు ఎకరాలు మల్బరీ సాగుకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.
21రోజుల్లోనే పంటచేతికి..
పట్టు పురుగుల పెంపకం చాలా తేలికైందని చెప్పవచ్చు. కుటుంబసభ్యులు కలిసి చేసుకుంటే చక్కటి ఆదాయ మార్గంగా అధికారులు సూచిస్తున్నారు. మల్బరీ పంట సాగు చేసి ఆకులు కోత దశకు చేరుకోగానే పట్టు పురుగులకు సంబంధించిన గుడ్లను బుక్ చేసుకోవాలి. 100 గుడ్లకు రూ.750 ఖర్చవుతుంది. ఇతర ప్రాంతాల నుంచి ఈ గుడ్లను తెప్పించడం జరుగుతుంది. విక్రయించేవారు పది రోజులపాటు వాటిని పెంపకం చేపట్టి అందజేస్తే 100 గుడ్లకు రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. నేరుగా గుడ్లు కొనుగోలు చేస్తే, తీసుకువచ్చిన గుడ్లపై నల్లటి బట్టను కప్పి ఉంచాలి. ఇందులో 50శాతం వరకు పిల్లలు బయటకు వచ్చినప్పుడే నల్లటి బట్ట తీసి మొత్తం గుడ్లను లైట్ వెలుతురులో పెట్టాలి. తద్వారా 90శాతం పురుగులు బయటికి రావడం జరుగుతుంది. ఈ చిన్న పురుగులను చిన్న ట్రేలో వేసి వాటిపై నైలాన్ నెట్ కప్పి లేత ఆకులు చిన్నగా తరిగి నెట్పై వెదజల్లాలి. ఆకులను ఆహారంగా తీసుకొని పురుగులు రెండు నుంచి మూడు రోజుల్లో రెండో దశలోకి వెళ్తాయి. ప్రతిరోజూ ఇదే విధానంలో పురుగులకు ఆకులు కట్ చేసి ఆహారంగా వేయాలి. పురుగులు మూడు, నాలుగవ దశలలోకి వెళ్తుంటాయి.
ఆ తర్వాత పురుగులు పట్టు గూళ్లు అల్లుకోవడానికి సిద్ధమవుతాయి. దీంతో పురుగులకు ఆహారం నిలిపివేసి వాటిని చంద్రికలపై వేయాలి. రెండుమూడు రోజుల వరకు గూళ్లు తయారవుతాయి. 5, 6 రోజుల వరకు చంద్రికల నుంచి పట్టు గూళ్లు వేరు చేసి మార్కెట్కు తీసుకువెళ్తారు. నెల రోజుల పంటలో నాలుగుసార్లు పురుగు నిద్రావస్త, గూడు అల్లుకునే సమయంలో 5 రోజులు రైతులకు ఎలాంటి పని ఉండదు. కేవలం 21 రోజులు రైతులు పని చేయాల్సి ఉంటుంది. లేదంటే 7 నుంచి 10 రోజుల చిన్న పట్టు పురుగులు కావాలంటే తెచ్చుకోవచ్చు. 100 చిన్న పట్టు పురుగులకు రూ.3,500లకు ఇస్తారు. పట్టు గూళ్లను హైదరాబాద్లోని తిరుమలగిరి మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. ప్రస్తుతం కిలో పట్టు గూళ్లు రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. 100 గుడ్ల నుంచి 80 కిలోల పట్టు గూళ్లు వస్తాయని సెరికల్చర్ అధికారులు పేర్కొన్నారు. ఈ లెక్కన 100 గుడ్ల నుంచి వచ్చే పట్టుగూళ్లు విక్రయించడం ద్వారా సుమారు రూ.48,000 వరకు ఆదాయం వస్తుంది. సంవత్సరంలో నాలుగు నుంచి అయిదు పంటలు తీయవచ్చు. దీంతో ఏడాదిలో కనీసం రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం చేకూరుతున్నది. ఒకసారి సాగు చేసిన మల్బరీ మొక్కలు సుమారు 20 సంవత్సరాల వరకు ఉంటాయి. దీంతో పట్టు పురుగుల పెంపకం మంచి లాభదాయకంగా పేర్కొంటున్నారు.
మల్బరీ సాగుకు ప్రోత్సాహం..
పట్టుపురుగుల పెంపకం కోసం అవసరమయ్యే మల్బరీ సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మల్బరీ సాగుకు సంబంధించి 2 ఎకరాల్లో సాగు చేసేందుకు రూ.50000 అవసరమవగా జనరల్ కేటగిరి వారికి 50శాతం, ఎస్సీ, ఎస్టీలకు 65శాతం సబ్సిడీ అందజేస్తారు. సిల్క్ సమగ్ర స్కీం కింద ఎస్సీ, ఎస్టీలు, ఇతర రైతులకు సర్కార్ ప్రోత్సాహం అందజేస్తున్నది. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన రేరింగ్ షెడ్ నిర్మాణానికి సుమారు రూ.4లక్షలు అవసరమవుతుండగా ఎస్సీ, ఎస్టీలకు 65శాతం సబ్సిడీ కింద రూ.2.60లక్షలు అందజేస్తుండగా ఇతరులకు 50శాతం సబ్సిడీగా రూ.2లక్షలు ఇస్తుంది. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన సెల్ఫ్లతో కూడిన స్టాండ్కు రూ.75000 అవసరమవగా ఎస్సీ, ఎస్టీలకు 65శాతం సబ్సిడీ, ఇతరులకు 50శాతం సబ్సిడీ అందజేస్తారు. ఇప్పటికే మల్బరీ సాగు చేస్తున్న రైతులు ఉంటే వారికి షెడ్డు నిర్మాణానికి ఆర్కేవీవై కింద రైతులకు 50శాతం సబ్సిడీగా రూ.2లక్షలు అందజేస్తారు. ఈ పథకాల కింద రైతులకు వివిధ దశలలో డబ్బులు విడుదల చేస్తారు. షెడ్ నిర్మాణంలో బేస్మెంట్ స్థాయి, లెంటల్ స్థాయి, స్లాబ్ స్థాయిల్లో డబ్బులు విడుదల చేస్తారు. అనంతరం మల్బరీ సాగు చేస్తున్న సమయంలో, ఆ తర్వాత పట్టు పురుగుల పెంపకం ప్రారంభించే ముందు సెల్ఫ్లకు సంబంధించిన సబ్సిడీ విడుదల చేస్తారు.
300 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యం..
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ సంవత్సరం సుమారు 300 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. జిల్లాలోని తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో మల్బరీ సాగు ఎంతో అనువైందని పేర్కొంటున్నారు. ఇప్పటికే 221 ఎకరాల్లో రైతులు మల్బరీ సాగు చేయగా, ఈసారి అదనంగా 300 ఎకరాల్లో సాగు చేయాలని సూచించడంతో ప్రతి మండలంలోనూ ఈ అంశంపై సెరికల్చర్ అధికారులు రైతులను కలిసి అవగాహన కల్పిస్తున్నారు. మల్బరీ సాగుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహం, ఎంత విస్తీర్ణంలో మల్బరీ సాగు చేస్తే ఎంత లాభం వస్తుంది రైతులకు తెలియజేయడం ద్వారా మల్బరీ సాగుకు వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల వారీగా ఎక్కడ మల్బరీ సాగు పెరిగే అవకాశముందని అధికారులు గుర్తించారు. రైతుల వారీగా కలిసి మల్బరీ సాగుకు కృషి చేస్తున్నారు.
పట్టు పురుగుల పెంపకంతో లాభాలు
పట్టు పురుగుల పెంపకంతో మంచి లాభాలు పొందవచ్చు. జిల్లాలో ప్రస్తుతం 221 ఎకరాల్లో మల్బరీ సాగులో ఉన్నది. తద్వారా రైతులు పట్టు పురుగుల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. పట్టు పరుగుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చక్కటి ఆదాయం ఇచ్చే పట్టు పురుగుల పెంపకానికి అవసరమయ్యే మల్బరీ సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రైతులను కలిసి వారు మల్బరీ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం.
– ఎ.మల్లికార్జున్, ఏడీ, సెరికల్చర్