ధారూరు, జూన్ 8: వానకాలం సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఉండేందుకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో మండలంలోని రైతులకు జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల మేలు కోసం తీసుకునే నిర్ణయంలో మన రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. రైతులు లైసెన్స్ పొందిన దుకాణాల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి, రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న డీలర్లపై ప్రభుత్వం పీడీ యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నదన్నారు. వ్యవసాయ అధికారులు సూచించిన మెళకువలను పాటించాలన్నారు. ప్రతి క్లస్టర్ వారీగా రైతు వేదికలను నిర్మించి, ప్రభుత్వం రైతులను సంఘటితం చేస్తున్నదన్నారు. విపత్కర సమయంలోనూ పెట్టుబడి సాయాన్ని (రైతుబంధు) ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నదన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేద కుటుంబాలకు వరంగా మారాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. స్థానిక జడ్పీహెచ్ఎస్లో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 109మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. పేద ఆడబిడ్డల పెండ్లి చేయడానికి పడుతున్న ఇబ్బందులు గుర్తించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీంతో పేదల జీవితాల్లో కల్యాణ కాంతులు నింపారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, వికారాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ రాజుగుప్త, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్, మండల రైతు బంధు అధ్యక్షుడు రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి యూనుస్, ధారూరు పీఏసీఎస్ మాజీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వీరేశం, తహసీల్దార్ భీమయ్య గౌడ్, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, ధారూరు, ఎబ్బనూర్ గ్రామాల సర్పంచులు చంద్రమౌళి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.