బొంరాస్పేట, ఫిబ్రవరి 15 : గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైట్ను అమలు చేస్తున్నదని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కోటాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదివే 453 మంది పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక డైట్ ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మే నెలలో నిర్వహించే ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలను సాధించేందుకు విద్యార్థులకు స్సెషల్ నోట్బుక్స్, కంపాక్సులు, ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్ను అందిస్తున్నట్లు కోటాజీ చెప్పారు. పరీక్షల దృష్ట్యా సిలబస్ను త్వరగా పూర్తిచేసి రివిజన్ను ప్రారంభించాలని ఆదేశించామన్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహించి పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఐదు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఆంగ్లం, సైన్స్, గణితం, హిందీ సబ్జెక్టులు బోధించడానికి ట్యూటర్లను నియమించినట్లు తెలిపారు. ఒక్కో ట్యూటర్కు నెలకు రూ.1500ల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ సంవత్సరం రెండు జతల దుస్తులు, కార్పెట్లు, టవల్స్, మాస్కులు, శానిటైజర్లు, కాస్మొటిక్స్ అందజేశామని ఆయన చెప్పారు. అంతకుముందు విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. టీచర్లు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విక్రంసింగ్ చౌహాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మండలంలోని పలు గిరిజన తండాల్లో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో డీటీడబ్ల్యూవో కోటాజీ, విద్యార్థినులు, హెచ్ఎం విక్రంసింగ్, ఉపాధ్యాయులు సేవాలాల్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజనుల అభ్యున్నతికి సేవాలాల్ చేసిన సేవలను ఆయన విద్యార్థులకు వివరించారు. మండలంలోని పలు తండాల్లో కూడా గిరిజనులు సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించి ర్యాలీలు చేపట్టారు.