మంచాల డిసెంబర్ 10 : అధిక భాస్వరంతో నేలల్లో సారం తగ్గి పంట దిగుబడి రావడం లేదు. ఈ భాస్వరాన్ని కరిగించేందుకు బ్యాక్టీరియాను వాడడం వల్ల సత్ఫలితాలు వస్తున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మంచాల మండలంలో నూటికి 90 శాతం ప్రజలు వ్యవసాయం, పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం 32వేల ఎకరాల భూమి ఉండగా.. సాగుకు అనువైన భూమి 23వేల ఎకరాలు. ఇందులో మొత్తం సాగు చేసిన భూమి 14వేల 800ఎకరాలు కాగా.. అందులో వరి సాగు చేసిన భూమి 8382 ఎకరాలు, కూరగాయ, తదితర పంటలను 1200 ఎకరాల్లో సాగు చేశారు. భూసార పరీక్షలు చేయడంతో నేలలో భాస్వరం అధికంగా ఉన్నట్లు తేలింది. దీంతో భాస్వరాన్ని కరిగించే పోషకాలను నేలలో నిల్వ ఉంచడం వల్ల పంట దిగుబడి తీయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించారు. భాస్వరం కరిగించే బ్యాక్టీరి యాపై తయారు చేసే విధానాన్ని రైతులకు వివరించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 70 మంది రైతులకు సంబంధించి 300 ఎకరాల్లో భాస్వరం కరిగించే బ్యాక్టీరియాను ఉపయోగించారు. కాంప్లెక్స్ ఎరువులు, రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించారు. దీంతో ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి వచ్చి, రైతులకు లాభాలు వస్తుండడం గమనార్హం.
భాస్వరం కరిగించే బ్యాక్టీరియాను వాడాలి..
భాస్వరం కరిగించే బ్యాక్టీరియా ఎరువును రైతులు తప్పనిసరిగా వాడాలి. ప్రధానంగా నేలను కాపాడుకోవడమే కాకుండా పంట దిగుబడి వస్తుంది. ప్రతి రైతు తప్పనిసరిగా భాస్వరం కరిగించే భ్యాక్టీరియా ఎరువులను వాడితే పెట్టుబడి తగ్గడంతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
– జ్యోతిశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి
రసాయన ఎరువులు తగ్గించాలి..
వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రసాయనిక ఎరువులను తగ్గించా. ఎకరాకు ఒక కిలో భాస్వరం కరిగించే బ్యాక్టీరియాను 50కిలోల పశువుల పేడలో కలిపి, ఐదు రోజుల పాటు మరగబెట్టాను. వరి నాటిన 5 రోజుల్లోపు పొలంలో వేశా. 25కిలోల యూరియా వేసుకుంటే 29 క్వింటాళ్ల వరి పంట దిగుబడి వచ్చింది. భాస్వరం కరిగించే బ్యాక్టీరియా ఎరువులు వాడడం వల్ల లాభాలు వచ్చాయి.
– దాసరి మల్లయ్య