కొడంగల్, నవంబర్ 30 : కాంగ్రెస్ కథ కంచికి చేరువైందని, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరితో ఛీకొట్టి భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్లో మార్నింగ్ వాక్ నిర్వహించి పలువార్డుల్లోని గల్లి గల్లి తిరిగి ప్రజలతో నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. దాంతో పాటు బాకారం, కలాల్వాడీ వీధుల్లో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్లో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నాణ్యతాప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లకు తప్పకుండా కనీసంగా 15 రోజుల పాటు క్యూరింగ్ చేపట్టాలని, లేకుంటే బిల్లులు నిలిపివేస్తానని హెచ్చరించారు. అనంతరం మండలంలోని హస్నాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలోకి చేరుతున్న మైనార్టీలు, గ్రామస్తులకు పార్టీ కండువాతో ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఖతమైందని, మునుగోడు ఎన్నికలే సాక్ష్యమని ఎద్దేవా చేశారు. రేవంత్ ఎక్కడ కాలు పెడితే ఆ పార్టీ భూస్థాపితమేనని, రేవంత్ ఐరన్లెగ్తో గతంలో టీడీపీని కనుమరుగు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ను కూడా ఖతం చేస్తున్న ఘనత రేవంత్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులకు పదవులపైనే వ్యామోహం తప్ప ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధిలేదన్నారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని పార్టీల వారు ఆకర్షితులవుతున్నారని భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్రత్యేక దృష్టితో వందల కోట్ల నిధులు మంజూరుతో జోరుగా అభివృద్ధి పనులతో ముందుకు దూసుకెళుతున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని, మార్చి నాటికి డబుల్ బెడ్రూంల ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్రావు యాదవ్, వెంకట్రెడ్డి, రమేశ్, సరోజ, పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్ సయ్యద్ అంజద్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణలతో పాటు టీఆర్ఎస్ నాయకులు చాంద్పాషా, బాబర్, నవాజుద్దీన్, రమేష్బాబు, మునీర్, మల్లప్ప, నాగేశ్వర్రావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.