షాబాద్, నవంబర్ 24 : జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 8గంటల వరకు మంచు కమ్ముకుంటుంది. చలి తీవ్రం కావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా, చలినుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తులను వినియోగిస్తున్నారు.
మంచు గుప్పిట్లో గ్రామాలు…
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో తెల్లవారుజాము నుంచే మంచు గుప్పిట్లో గ్రామాలు కమ్ముకుంటున్నాయి. తెల్లారి ప్రజలు రోడ్డుపైకి రావాలంటే మంచు దుప్పటి కప్పేస్తున్నది. గ్రామాల్లో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతల కారణంగా చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9గంటల వరకు చలి గాలులు వీస్తుండడంతో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై వాహనాలపై వెళ్లే ప్రజలు చలి తీవ్రతకు తట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాయంత్రం 5గంటలు దాటితే చాలు జనాన్ని చలి వణికిస్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరి…
జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోరుగా వీస్తున్న గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. దీనికి తోడుగా గాలిలో తేమశాతం పెరగడంతో ఉదయం వేళల్లో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటుంది. తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8గంటల వరకు గ్రామాలతో పాటు రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయి. చలి గాలుల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.