ఆదిబట్ల, నవంబర్ 24 : సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక రంగాన్ని ప్రవేశపెట్టి రైతులకు వ్యవసాయశాఖ అధికారుల సేవలను అను సందానం చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది. ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి సాగు చేసిన పంటలు పరిశీలిస్తూ రైతులకు నిత్యం అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. వ్యవసాయాధికారుల గైర్హాజరుకు చెక్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి, రైతులకు అవగాహనలు కల్పించి వివరాలను యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
సేవలు మెరుగుపర్చేందుకు..
రైతులకు క్షేత్రస్థాయిలో సేవలు విస్తరించడం, వ్యవసాయ అధికారుల పనితీరును మెరుగుపర్చేందుకు యాక్టివిటీ లాంగర్ యాప్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. గ్రామాల్లో పంటలను పరిశీలించాల్సిన వ్యవసాయ విస్తరణ అధికారుల్లో కొంత మంది కేవలం రైతువేదికలకే పరిమితమయ్యేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గతేడాది యాక్టివిటీ లాంగర్ యాప్ను రూపొందించింది. అయితే ఈ యాప్లో లోపాలను ఆసరా చేసుకున్న కొంతమంది క్షేత్రస్థాయికి వెళ్లకుండానే పాత ఫొటోలను అప్లోడ్ చేసేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు యాప్ను ఆధునీకరించి లైవ్ లోకేషన్కు శ్రీకారం చుట్టారు. రైతులకు సాగు పద్ధతులను వివరిస్తున్న సమయంలోనే లైవ్లో ఫొటో తీసి యాప్లో పొందుపర్చాలి. అలా రోజులో ఏఏ ప్రాంతాల్లో పర్యటించారు. ఎంతమంది రైతులను కలిశారో యాప్లో నమోదు చేస్తేనే హాజరు పడినట్లు లెక్క. యాప్లో నమోదు చేయని పక్షంలో ఆ రోజు సంబంధిత ఏఈవో విధులకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు.
యాప్లో 17 అంశాలు నమోదు..
వ్యవసాయ రంగంలో తీసుకువస్తున్న సంస్కరణల్లో భాగంగా ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు ప్రారంభించిన యాక్టివిటీ లాంగర్ యాప్లో 17 అంశాలల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్కు ఒక ఏఈవోను నియమించారు. జిల్లాలో 37 మండలాల్లో 83 క్లస్టర్లు ఉండగా 83 మంది ఏఈవోలు పని చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటలలోగా తమ క్లస్టర్లోని రైతు వేదికకు చేరుకోవాలి. రైతు వేదిక వద్ద సిగ్నల్స్ లేని పక్షంలో సమీప గ్రామ పంచాయితీ వద్దకు వెళ్లి ఫొటో దిగి యాప్లో అప్లోడ్ చేయాలి. ఆపై క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు సాగు పద్ధతులు, సూచనలు, సలహాలు అందించాలి. చేనులోనే రైతులతో కలిసి ఫొటో దిగి అప్లోడ్ చేయాలి. పంటల నమోదు, అధిక దిగుబడుల కోసం రైతులకు సూచనలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన తదితర విషయాలను యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పర్యటనను ముగించుకుని తిరిగి ఏఈవోలు రైతు వేదిక చేరుకోవాలి. ఇలా మొత్తం 17 అంశాలతో జాబ్చార్ట్ను తయారు చేసుకోవాలి. యాప్లో అప్లోడ్ చేసిన వివరాలు నేరుగా వ్యవసాయశాఖ కమిషనరేట్కు చేరుతాయి. దాని ఆధారంగానే ఏఈవోల పనితీరుకు గ్రేడింగ్ ఇస్తారు.
రైతులకు మెరుగైన సేవలు..
వ్యవసాయశాఖలో అమలు చేస్తున్న యాక్టివిటీ లాంగర్ యాప్ ద్వారా ఏఈవో పనితీరు మరింత మెరుగు పడి క్షేత్రస్థాయిలో రైతులకు మెరుగైన సేవలు అందుతాయి. ఏఈవోలు ఉదయం రైతు వేదికకు చేరుకుని అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. రైతులను కలిసి వారితో ఫొటో దిగి యాప్లో అప్లోడ్ చేయాలి. క్షేత్రస్థాయికి వెళ్లకపోయినా యాప్లో ఫొటోలు అప్లోడ్ చేయకపోయినా ఆ రోజు హాజరు లేనట్టే. ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ఈ యాప్ సేవలు రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా అమలులోకి తెచ్చారు.
-గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి..
ప్రతి రోజూ ఫీల్డ్కు వెళ్తాం..
ప్రతి రోజూ ఫీల్డ్కు వెళ్తాం. ఉదయం 11 గంటలకే రైతుల వద్దకు వెళ్లి రైతులతో ఫొటోలు దిగి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్లో అప్లోడ్ చేస్తాం. తరువాత గ్రామాల్లోని రైతుల వ్యవసాయ పొలాల్లో పంటల సాగుపై రైతుల నుంచి వివరాలు సేకరిస్తాం. రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తాం. దీంతో ఎప్పటి కప్పుడు రైతుల సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. దీంతో రైతుల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం.
-రఘు, ఏఈవో ఇబ్రహీంపట్నం మండలం