రంగారెడ్డి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. బంగారు భవిష్యత్తుకు ‘బంధు’వులా చేయూతనందిస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నారు. ఎంపిక చేసుకున్న యూనిట్లు మంజూరు కావడంతో దళితులు జీవనోపాధి పొందుతూ ఆనందంగా గడుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్నగర్, శేరి లింగంపల్లి నియోజకవర్గాల్లో 697 యూనిట్లకు దరఖాస్తులు రాగా, 670 యూనిట్లకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయింది. మొదటి విడుతలో రాష్ట్ర సర్కార్ రూ.17.75 కోట్లను కేటాయించగా, మంజూరైన పలు రకాల యూనిట్లతో ఉపాధి పొందుతూ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మలి విడుతలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. దళిత సాధికారత సీఎం కేసీఆర్కే సాధ్యమని జిల్లాలోని దళితులు జేజేలు పలుకుతున్నారు.
దళితుల ఆర్థిక ఎదుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల నుంచి దళిత బంధు పథకానికి 697 యూనిట్లకు దరఖాస్తులు రాగా, 670 యూనిట్లకు ‘బంధు’ గ్రౌండింగ్ ఖరారైంది. కాగా, మిగిలిన వాటికి ప్రక్రియ పూర్తి కానుంది. ఇది త్వరలో పూర్తి కానున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. దళిత బంధుతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. లబ్ధిదారులు చిన్నచిన్న పరిశ్రమల వైపు మొగ్గు చూపేలా అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. దళితుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం ఈ పథకం ద్వారా ప్రత్యేకంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నది. మొదటి విడుతలో రూ.17.75 కోట్లను కేటాయించారు. ఇదే స్కీమ్లో మలి విడుత కూడాఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో మరింత మందికి లబ్ధి చేకూరేలా అధికారులు కార్యాచరణకు సన్నాహాలు చేస్తున్నారు. దళిత బంధు పథకంలో భాగంగా రూ.10లక్షల్లో రూ.9,90,000 లబ్ధిదారులకు అందజేస్తుండగా.. రూ.10వేలను రక్షణ నిధి కోసం కేటాయిస్తున్నది. ఎనిమిది నియోజకవర్గాల్లో 697 మంది లబ్ధిదారులకు రూ.9.90 లక్షలతో వారు కోరుకున్న యూనిట్లను అధికార యంత్రాంగం అందజేస్తున్నది.
దళిత ‘బంధు’ దేశానికే ఆదర్శం
ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా దళిత బంధు పథకంతో తెలంగాణలో వందలాది కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాయి. పొరుగు రాష్ర్టాల ప్రభుత్వాలు తెలంగాణ పథకాలను ఆకళింపు చేసుకొని, వాటిపై అవగాహన పెంచుకొని పేరు మార్పిడితో అవే పథకాలను అమలులోకి తెస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ర్టాలు ప్రస్తుతం కాపీ కొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
భవిష్యత్తులో మరిన్ని యూనిట్లకు లబ్ధి చేకూరేలా..
‘దళిత బంధు’ పథకం ద్వారా మరింత మందికి భవిష్యత్తులో లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం కార్యాచరణ చేపడుతున్నది. ఇప్పటికే దాదాపు 700 యూనిట్లకు గ్రౌండింగ్ పూర్తైన విషయం తెలిసిందే. ఇవే కాకుండా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో దాదాపు 3000 యూనిట్లకు లబ్ధి చేకూరేలా, అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దళితుల పురోభివృద్ధి కోసమే ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
దళిత బాంధవుడు కేసీఆర్..
రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ సీఎం కేసీఆర్ బాంధవుడయ్యాడు. సమాజంలో దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మకం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దళితులంతా కేసీఆర్ వెంటే ఉంటారు. ఈ పథకంతో కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. ఎంతో మంది అభాగ్యులు ఈ పథకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.
– ధనోవ, లబ్ధిదారు, శంకర్పల్లి
దళిత బంధుతోనే ఉపాధి
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో నాకు దళిత బంధు ద్వారా కారు వచ్చింది. దీంతోనే నాకు శాశ్వత ఉపాధి దొరికింది. గతంలో నేను హైదరాబాద్లో కారు నడుపుతూ ఉపాధి పొందేవాడిని. రెండేండ్ల క్రితం వరదలు వచ్చి నా కారు నీళ్లల్లో కొట్టుకుపోయింది. నాకు ఉద్యోగ భృతి కూడా పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నన్ను ఆదరించి, ఆదుకున్నది. సర్కారుకు రుణపడి ఉంటా.
– వెంకటేశ్, రేగడి చిల్కమర్రి, కొందుర్గు మండలం
దళిత బంధు దేశానికే ఆదర్శం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశంలోనే చాలా గొప్ప పథకం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నాకు ఈ పథకం ద్వారా నాకు సిమెంట్ ఇటుకల తయారీ మిషన్ వచ్చింది. దీంతో మా కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాను. ప్రభుత్వం ఎంతో మంది సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మమ్మల్ని ఆదరిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– నల్ల ప్రభాకర్, ఇబ్రహీంపట్నం
మా కుటుంబాన్ని ‘బంధు’ ఆదుకుంది
ఆర్థికపరంగా చిన్నాభిన్నమై ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్న మా కుటుంబాన్ని దళిత బంధు పథకం ఆదుకుంది. పథకం కింద మాకు టెంట్ హౌజ్ మంజూరు కావడంతో మా కుటుంబంలో నలుగురికి మంచి ఉపాధి దొరికింది. మా బతుకుల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడ్డాం. కేసీఆర్ను నమ్ముకున్నోళ్లకు భద్రతతోపాటు భరోసా ఉంటది.
– పి.రాజ్కుమార్, ఇబ్రహీంపట్నం
చేతి నిండా పని దొరికింది
నేను భార్యాపిల్లలతో కలిసి గ్రామంలో పని చేసుకుంటూ జీవిస్తున్నాను. పని సరిగా లేక ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దళిత బంధు పథకం ద్వారా వచ్చిన రూ.10 లక్షలతో కారు కొనుక్కొని నడుపుతున్నాను. ఇప్పుడు చేతి నిండా పని దొరికింది. ప్రతి నెలా గిరాకీ ఉంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడినట్లేననే భరోసా వచ్చింది. నన్ను, నా కుటుంబాన్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
– తడకల రమేశ్, లబ్ధిదారుడు, వీర్లపల్లి గ్రామం, నందిగామ మండలం
ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యాయి
నాకున్న ఒక్కగానొక్క కొడుకు కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమైంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షలు ఇవ్వడంతో ట్రాక్టర్ కొన్నాం. వ్యవసాయంలో ట్రాక్టర్తో పనులు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాం.
– ఏకుల యాదయ్య, లబ్ధిదారుడు, నందిగామ మండలం
ప్రభుత్వ ఆదేశాల మేరకు మలి విడుత
దళిత బంధు పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 697 యూనిట్లకు 670 యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. మిగిలిన యూనిట్లు ఫ్రీ గ్రౌండింగ్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. లబ్ధిదారుల నైపుణ్యం ఆధారంగా వారు కోరుకున్న యూనిట్లను అందజేశాం. అన్ని యూనిట్లకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. మలి విడుత దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహిస్తున్నాం.
– ప్రవీణ్ కుమార్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, రంగారెడ్డి జిల్లా