యాచారం, ఫిబ్రవరి 10 : సర్కారు బడికి మంచిరోజులోచ్చాయి. ప్రభుత్వ సహకారంతో పాటు సీఎస్ఆర్ (కార్పొరేట్ రెస్పాన్సిబుల్ స్కీం) కింద పాఠశాలలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వడంతో తరగతి గదులు, పరిసర ప్రాంతాల రూపురేఖలు ఒక్కసారిగా మారుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో అధ్వానంగా ఉన్న పాఠశాలలు ప్రస్తుతం సకల సౌకర్యాలకు నిలయంగా మారుతున్నాయి. సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు ఆంగ్ల విద్యను ప్రవేశ పెడుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నది. స్వచ్ఛంద సంస్థలు సైతం మరోపక్క పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. సొంత నిధులతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ పట్టనున్నది.
మండలంలోని మేడిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. రూ.9లక్షల నిధులతో తరగతి గదుల మరమ్మతులతో పాటుగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. అధ్వానంగా ఉన్న పాఠశాలకు అన్ని విధాలుగా మరమ్మతు పనులు చేయిస్తున్నారు. గతంలో పాఠశాల గదులకు తలుపులు, కిటికీలు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడేవారు. పాఠశాలలో ఫ్యాన్లు, బెంచీలు, కుర్చీలు లేక అవస్థలు పడేవారు. పాఠశాల ముండ్ల కంప చెట్లతో, కలుపు మొక్కలు, చెత్తాచెదారంతో పరిసరాలు పారిశుధ్యం లోపించి అధ్వానంగా ఉండేది. పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు, పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. కనీస వసతులు లేక ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు పడేవారు. ఇలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పాఠశాలకు సీఎస్ఆర్ కార్పొరేట్ రెస్పాన్సిబుల్ స్కీం కింద కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ పాఠశాల దుస్థితిని గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు పనులను ముమ్మరం చేసింది.
మండలంలోని మేడిపల్లి ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.9లక్షలతో పలు నిర్మాణ పనులను కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. పాఠశాలలో కొన్ని రోజులుగా ముమ్మరంగా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పాఠశాలలో తరగతి గదుల నిర్మాణ పనుల్లో భాగంగా తరగతి గదులు తలుపులు, కిటికీలతో పాటు గ్రిల్స్ను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు బిగించారు. తరగతి గదుల ఆవరణలో మెట్లు, ర్యాంపులు నిర్మించారు. పెచ్చులూడి పోయిన గోడలకు మరమ్మతులు చేశారు. తరగతి గదుల్లో ఫ్లోరింగ్ చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతులతో పాటుగా విద్యుత్, నీటి, డ్రైనేజీ, కుండీలను ఏర్పాటు చేశారు. వంటగది పైకప్పుకు రేకుల షెడ్డుతో పాటు సెల్ప్ల నిర్మాణం చేశారు. ప్రహరీ నిర్మాణానికి మరమ్మతులు చేసి ప్రధాన గేటును ఏర్పాటు చేశారు. గేటుపై భాగంలో పాఠశాల బోర్డును సైతం ఏర్పాటు చేశారు. పాఠశాలలో అరుగులు, మెట్లు, ర్యాంపులు నిర్మించారు. నీటి నిల్వ కోసం సంపు నిర్మాణాన్ని చేపట్టారు. సెప్టిక్ ట్యాంకుకు మరమ్మతు చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ఫిల్టర్ సౌకర్యాన్ని సైతం కల్పించనున్నారు. రెండో దఫా కింద పాఠశాలకు బెంచీలు, కుర్చీలు, కంప్యూటర్లు తదితర వస్తువులను అందజేసేందుకు కృషి చేస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.