నెట్వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 4: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చా రు. మంగళవారం పలు ఆలయాలు, మండపాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు ఉదయం నుంచే భక్తులు ఇష్టమైన నైవేద్యా లను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పలు మండపాల వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
షాద్నగర్ పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప ఆలయంలోని అమ్మవారు, వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం లోని అమ్మవారు, పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరాలయం లోని అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొల్పిన దుర్గామాత ప్రతిమల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని గాంధీనగర్కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు మున్సిపల్ చైర్మన్ నరేందర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు వేణుగోపాల్, రమేశ్, అభిలాశ్, సువర్ణ, చంద్రకళ పాల్గొన్నారు.