సీతాఫలాల సీజన్ వచ్చిందంటే చాలు పేదవారికి పండుగే.. ప్రకృతిమాత అందించే ఈ మధుర ఫలాలు కొంతమందికి ఉపాధిని చూపుతున్నాయి. ప్రస్తుతం పెద్దగా వ్యవసాయ పనులు లేని సమయంలో సీతాఫలాల సేకరణ చక్కటి ఉపాధి మార్గంగా మారిందని పేర్కొనవచ్చు. పరిగి ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఎగుమతి చేయడం ద్వారా ప్రతి ఏడాది లక్షలాది రూపాయల లావాదేవీలు సాగుతున్నాయి. చలికాలం ప్రారంభంలోనే ఈ సీతాఫలాలు కాతకు వచ్చి మార్కెట్లో లభిస్తుంటాయి. ఈసారి మరికొద్ది రోజుల ముందుగానే సీతాఫలాలు మార్కెట్లోకి వచ్చాయి. సీతాఫలాల సేకరణకు ఉదయమే అటవీబాట పట్టి చెట్టుచెట్టుకూ తిరిగి కాయలు కొసుకొచ్చి విక్రయిస్తుంటారు. మరికొందరు కాయలను మాగేసి పండ్లుగా చేసి విక్రయిస్తుంటారు.
కులకచర్ల, ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్4 : పరిగి నియోజకవర్గంలో ప్రధానంగా కులకచర్ల, దోమ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తాయి. కులకచర్ల మండలంలోని ముజాహిద్పూర్, రాంరెడ్డిపల్లి, చౌడాపూర్, చాకల్పల్లి, అల్లాపూర్, మక్తవెంకటాపూర్, రాం పూర్, కామునిపల్లి, పీరంపల్లి, అడవివెంకటాపూర్, గండిచెరువు, కుస్మసముద్రం, అనంతసాగర్, పుట్టపహాడ్ గ్రామాల పరిధిలో కాస్తాయి. కొద్ది మొత్తంలో లభించే చోట తమ స్వగ్రామాల్లోనే ఇంటింటికీ తిరిగి వీటిని కొంతమంది విక్రయిస్తుంటారు. గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఈ కాయలను తీసుకొచ్చి ఇతర పట్టణాలకు మరికొంత తరలి స్తుంటారు. కులకచర్ల మండల పరిధిలోని సుమారు 10 గ్రామాల పరిధిలో అనేక మందికి ఈ సీజన్లో సీతాఫలాల సేకరణ చక్కటి ఉపాధిగా మారింది.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
కులకచర్ల మండల పరిధిలోని అనేక గ్రామాల నుంచి సీతాఫలాలు హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. మండలంలోని కొన్ని గ్రామాలకు చెందినవారు ఈ ప్రాంతం నుంచి వాహనాల్లో సీతాఫలాలను తరలిస్తారు. ఆయా గ్రామాల్లో మహిళలు పెద్దఎత్తున సీతాఫలాలను సేకరిస్తుంటారు. ప్రతి గ్రామంలోనూ సుమారు 50 మందికిపైగా ఉపాధిని పొందుతున్నారు. కేవలం గ్రామంలో ఉండేవారే కాకుండా.. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు కూడా ఈ సీజన్లో తిరిగి గ్రామాలకు చేరుకొని సీతాఫలాలను సేకరిస్తారు. తద్వారా వందలాది కుటుంబాలకు ఉపాధి మార్గంగా మారింది. తెల్లవారుజామునే ఇంటి పనులు పూర్తిచేసి అటవీ ప్రాంతానికి సీతాఫలాల కోసం వెళ్తుంటారు. ఒక్కొక్కరు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు గంపల వరకు సీతాఫలాలను సేకరిస్తుంటా రు. పూర్తిగా పండ్లు కాకుండా.. దోర కాయలను తెంపుకొచ్చి గంపల లెక్కన విక్రయిస్తారు. ఒక్కో గంపకు నిర్ణీత ధరను నిర్ణయిస్తారు. ఇక్కడ సేకరించిన సీతాఫలాలను వ్యాపారులు ఆయా వాహనాల్లో హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు.
నాణ్యతను బట్టి ధర
పెద్దగా ఉండి, తినడానికి అనువుగా ఉండే కాయలకు మంచి ధర పలుకుతుంది. ఇలాంటి కాయలు బుట్టకు రూ.300 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మరింత మంచిగా ఉంటే గంప ధర రూ.350 వరకు కూడా పలుకుతుంది. సేకరణదారుల నుంచి కొనుగోలు చేసిన వాటిని చిన్నపాటి బుట్టల్లో ప్యాక్ చేసి వాహనాల్లో తరలిస్తారు. సీతాఫలాల సేకరణ ద్వారా ప్రతిరోజూ ఒక్కొక్కరు కనీసం రూ.300-600 వరకు ఆర్జిస్తున్నారు. ఇక వ్యాపారులకు విక్రయించకుండా సొంతంగా మాగేసి పండ్లుగా మారిన తర్వాత స్వగ్రామాలు, సమీప పట్టణాలకు వెళ్లి విక్రయించేవారు మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. చదువుకునే వారు కూడా ఉదయం సమయంలో సీతాఫలాల సేకరణపై దృష్టి పెడుతున్నారు. ఈ ప్రాంతంలోని కొందరు వ్యాపారులకు ఈ సీజన్ పెద్ద ఆదాయ వనరుగా మారిందని చెప్పొచ్చు. ఉచితంగా లభించే సీతాఫలాలు పేదవాడి ఆర్థికాభివృద్ధిలో భాగంగా మారుతున్నాయి. విడిగా విక్రయించేవారు పెద్ద పండ్లను రూ.5-6 వరకు కూడా అమ్ముతున్నారు.
కూలీలకు ఉపాధి లభిస్తున్నది
ఈ సీజన్లో గ్రామాల్లోని చాలామంది అడవికెళ్లి పెద్దఎత్తున సేకరించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. దీంతో కూలి లేని సమయం లో కూలీలకు సీతాఫలాల ద్వారా ఉపాధి లభిస్తున్నది. మరికొంతమంది పెద్దపెద్ద గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి అమ్ముతున్నారు. దీంతో వారికి కూడా మంచి లాభాలు వస్తున్నాయి.
-పీరంపల్లి రాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, కులకచర్ల
స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
ఈ సీజన్లో సీతాఫలాలను విక్రయించేందుకు మండల కేంద్రంలో ఒక చోట స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేస్తే కూలీలకు తగిన ఉపాధి పొందేందు కు దోహదపడుతుంది. వ్యాపారులు సీతాఫలాలను విరివిగా సేకరిస్తుం డటంతో కూలీలకు డబ్బులు సక్రమంగా రావడంలేదు
– దామోదర్రెడ్డి, రాంరెడ్డిపల్లి, కులకచర్ల మండలం
కులకచర్ల ఎఫ్పీవో ద్వారా కూడా ..
కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యం లో సీతాఫలాల సేకరణను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని కామునిపల్లి, పీరంపల్లి, అనంతసాగర్ గ్రామాలు తప్ప మిగతా గ్రా మాల్లో సీతాఫలాలను సేకరించేందుకు అటవీశాఖ ద్వారా టెండర్లను తీసుకున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ఎఫ్పీవోకు అందుతుంది. సిబ్బంది సీతాఫలాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు.