పరిగి, సెప్టెంబర్ 29 : వికారాబాద్ జిల్లాలో ఈసారి యాసంగి సీజన్లో పంటల సాగుకు సంబంధించి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారంతో ఈ సాగు ప్రణాళికను రూపొందించారు. ఏ గ్రామంలో ఏ పంట సాగు చేయనున్నారనేది వివరాలు సేకరించి రాబోయే యాసంగి సీజన్లో వివిధ పంటల సాగు ఎలా ఉండనుందో అధికారులు అంచనా వేసి.. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడనున్నారు. ఇప్పటివరకు అధికారులు తయారు చేసిన ప్రణాళిక ఆధారంగా వికారాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో 1,40,816 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నారని అంచనాలు రూపొందించారు. ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సైతం అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు.
అత్యధికంగా 71వేల పైచిలుకు ఎకరాల్లో వరి సాగు
వచ్చే యాసంగి సీజన్లో జిల్లా పరిధిలో అన్ని పంటలు కలిపి 1,40,816 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించగా.. అందులో అత్యధికంగా 71,936 ఎకరాల్లో వరి, శనగలు 21,880., వేరుశనగ 21,556., జొన్న 8,513., మొక్కజొన్న 6,802., చెరుకు 2,438., తెల్ల కుసుమలు 4,194., మినుములు 38, పెసర 309, కందులు 1,153., ఇతర పంటలు 2,476 ఎకరాల్లో సాగు చేయబడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి యాసంగి సాగు ప్రణాళికను రూపొందించారు.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
జిల్లా పరిధిలో యాసంగి సీజన్లో సాగు చేయనున్న పంటల వివరాలతో ప్రణాళిక రూపొందించిన అధికారులు.. విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు అవసరమవుతాయో అంచనాలు తయారు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏ పంటలకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయనేది ప్రణాళిక రూపొందించి సంబంధిత విత్తనాలు జిల్లావ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. దీంతోపాటు ఎరువులు ఎంత మొత్తంలో అవసరమవుతాయనేది రూపొందించడంతోపాటు ఆయా నెలలవారీగా ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడనున్నారు. ఎరువుల కొరత రాకుండా అవకాశమున్నచోట బఫర్ స్టాకులను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు అధికారులు తీసుకోనున్నారు.
యాసంగి పంటల ప్రణాళిక సిద్ధం
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
జిల్లా పరిధిలో యాసంగి సీజన్లో సాగు చేసే పంటల సాగు ప్రణాళికను రూపొందించారు. ఈసారి యాసంగిలో జిల్లా పరిధిలో 1,40,816 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయబడతాయని అంచనా రూపొందించాం. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.