కడ్తాల్, నవంబర్ 22 : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని, సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుర్లకుంట చెరువు, రావిచేడ్ గ్రామంలోని నాగోని చెరువులో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, మత్స్యశాఖ జిల్లా అధికారి సుకీర్తితో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, మత్స్యకారులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. చెరువుల్లో పెరిగిన చేపలను మార్కెట్కు తరలించేందుకు సబ్సిడీపై వాహనాలను ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. మండలంలోని 42 చెరువుల్లో 6.50 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు ఏడీ సుకీర్తి తెలిపారు. ఆదివారం రాత్రి రావిచేడ్ గ్రామానికి చెందిన నర్సింహకు చెందిన 22 గొర్రెలు కుక్కలు దాడిలో చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ స్థానిక నాయకులతో కలిసి బాధితుడిని పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, సులోచన, హరిచంద్నాయక్, ఎంపీటీసీ గోపాల్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వెంకటేశ్, నాయకులు భాస్కర్రెడ్డి, చందోజీ, యాదగిరిరెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు.
చేతి వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తలకొండపల్లి : రాష్ట్రంలో చేతి వృత్తుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మత్స్యకారుల ప్రయోజనాన్ని కాంక్షించి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో గల 650 నోటిఫైడ్ చెరువులు, కుంటలు, చెక్డ్యాంలలో 80 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన, దేవునిపడకల్ గ్రామాల్లోని నల్లచెరువు, మహ్మద్ఖాన్ చెరువులో మంగళవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలోఎంపీపీ నిర్మల, సర్పంచ్లు కుమార్, శ్రీశైలం, మత్స్యశాఖ ఏడీ సుకీర్తి, రైతు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంక ర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రాంపూర్ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అనంతరం తలకొండపల్లి మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన నర్సింహకు రూ. 2.50 లక్షలు, కడ్తాల్కు చెందిన వెంకటేశ్కు రూ. 2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదే విదంగా రావిచేడ్ గ్రామానికి చెందిన కూలీలు సంతపూర్ గ్రామానికి ఆటోలో వెళ్తుండగా బోల్తా పడటంతో పలువురు గాయపడ్డారు. వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, శివశంకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, శరత్చంద్రశర్మ, జంగయ్య, రాజశేఖర్, మహేశ్, శ్రీకాంత్ ఉన్నారు.