దివ్యాంగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు రాష్ట్ర సర్కార్ పాఠశాల స్థాయి నుంచే వివిధ అంశాల్లో ఆటల పోటీలను నిర్వహిస్తున్నది. ఇటీవల నిర్వహించిన దివ్యాంగుల పోటీల్లో రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టోర్నమెంట్లను నిర్వహించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా దివ్యాంగులు క్రీడాస్ఫూర్తిని చాటారు.
మొదటగా నవంబర్ 24, 25 తేదీల్లో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో జిల్లా నుంచి 600 మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 29 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారికి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు పోటీలు నిర్వహించగా.. జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారులు రన్నింగ్, జావెలిన్ త్రో, షాట్ ఫుట్, వీల్ చైర్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చి 12 స్వర్ణాలు, 5 రజత పతకాలను సాధించారు. విజేతలకు పతకాలతోపాటు నగదు బహుమతులను వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
-రంగారెడ్డి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ, పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా దివ్యాంగులకు చేయూతనిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దివ్యాంగుల శ్రేయస్సుకు పలు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చి, వారిలో చైతన్యం తీసుకొస్తున్నది. వారిలో క్రీడా స్ఫూర్తిని నింపి మండల, జిల్లా స్థాయి ఆటల పోటీల్లో రాణించేలా కృషి చేస్తున్నది.
ఎల్బీ నగర్ స్టేడియంలో జరిగిన ఆటల పోటీలు..
అంతర్జాతీయ దివ్యాంగులు దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ స్టేడియంలో ఆటల పోటీలను నిర్వహించారు. మొదట జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన 29 మంది దివ్యాంగులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించారు. ఇందులో భాగంగా 29 నవంబర్ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారులు రన్నింగ్, జావెలిన్ త్రో, షాట్ ఫుట్, వీల్ చైర్ రేస్లో ప్రతిభ కనబర్చారు. జిల్లాకు 12 స్వర్ణ, 5 రజత పతకాలను సాధించారు. దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ గెలుపొందిన క్రీడాకారులకు పతకాలను అందజేశారు. జిల్లాకు మొత్తం 17 పతకాలను సాధించి పెట్టినందుకు జిల్లా సంక్షేమ అధికారి మోతి క్రీడాకారులను అభినందించారు.
జిల్లాకు పతకాలు, నగదు ప్రోత్సాహం..
ఆయా విభాగాలు, ఈవెంట్లలో ప్రథమంగా నిలిచిన విజేతలకు రూ.1000, ద్వితీయ బహుమతి విజేతకు రూ.700 నగదు ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉన్నతాధికారులు ప్రతిభను చూపిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
అధికారుల సేవలకు కృతజ్ఞురాలిని..
రాష్ట్ర ప్రభుత్వం మా కోసం ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం. అంధుల విభాగం షాట్ ఫుట్లో నేను గోల్డ్ మెడల్ సాధించా. ఇలాంటి ఆటలను అందించిన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగ సేవలకు కృతజ్ఞురాలిని. మా కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు.
– భాగ్యలక్ష్మి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, నేత్ర విద్యాలయ
పట్టుదల ఉంటే అన్ని రంగాల్లో రాణించగలరు…
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నవంబర్ 24, 25 తేదీల్లో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించాం. 600 మందికి పైగా దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 29 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు 12 స్వర్ణ, 5 రజత పతకాలు సాధించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు.
– మోతి, రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి, స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
పతకాలు సాధించినందుకు చాలా గర్వపడుతున్నా. సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఎంతో రుణపడి ఉంటాం. రాష్ట్రం కోసం, మాలాంటి దివ్యాంగుల కోసం సేవలందిస్తున్న అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు.
– నిరంజన్ రెడ్డి, నేత్ర విద్యాలయ
రన్నింగ్ సీనియర్ విభాగంలో పాల్గొన్న..
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం అథ్లెటిక్స్ నిర్వహించడం గర్వంగా ఉన్నది. 100 రన్నింగ్ సీనియర్ విభాగంలో బంగారు పతకం సాధించా. గడిచిన ఎనిమిదేండ్లుగా ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటున్నాను.
– బి.సాయిచందు, బీ కామ్, ఫైనల్ ఇయర్, నేత్ర విద్యాలయ
జావెలిన్ త్రో, షాట్ ఫుట్ విభాగాల్లో పాల్గొన్న..
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం నిర్వహించిన అథ్లెటిక్స్లో నేను జావెలిన్ త్రో, షాట్ ఫుట్ విభాగాలలో పాల్గొన్నా. వాటిలో సీనియర్ కేటగిరి నుంచి రెండు బంగారు పతకాలు సాధించా. అంధుల విభాగం నుంచి ఇది నా గొప్ప పతకంగా భావిస్తున్నా.
– నీలిమ, డిగ్రీ ఫస్టియర్, నేత్ర విద్యాలయ