‘ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని పెంపొందించాలి.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో చేవెళ్ల డివిజన్లోని గ్రామాల ప్రజాప్రతినిధులకు, వికారాబాద్ జిల్లా మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి జాతీయ జెండాలను పంపిణీ చేసి మాట్లాడారు. 15 రోజుల పాటు జరిగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. స్వాతంత్య్రం సాధించేందుకు పోరాడిన మహనీయుల చరిత్ర భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.
పరిగి, ఆగస్టు 9 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సూచించారు. మంగళవారం మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల వారికి మంత్రి సబితారెడ్డి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా పరిధిలో 2,47,692 ఇండ్లున్నాయని, ప్రతి ఇంటికి జాతీయ జెండా అందజేయనున్నామని తెలిపారు. ప్రతి పౌరుడు వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని మంత్రి సూచించారు.
స్వాతంత్య్రం సాధించేందుకు పోరాడిన మహనీయుల చరిత్ర రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ తరం వారిపై ఉందన్నారు. నేడు సోషల్ మీడియలో అబద్దపు ప్రచారాలే అధికమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ చరిత్రను విద్యార్థులకు తెలియజేసేందుకు జిల్లాలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సినిమా ప్రదర్శన నిర్వహించనున్నారని తెలిపారు. జిల్లాలో రోజుకు 7,120 మంది విద్యార్థులు గాంధీజీ సినిమా వీక్షిస్తారని చెప్పారు.
వజ్రోత్సవాల్లో భాగంగా రాఖీ పండుగ రోజు కనీసం 75 మందికి రాఖీలు కట్టి స్వాతంత్య్ర ఉత్సవాల స్ఫూర్తిని చాటాలన్నారు. ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు వెల్లివిరిసినపుడే స్వాతంత్య్ర ఫలాలు పూర్తిస్థాయిలో అందినట్లు అన్నది సీఎం కేసీఆర్ అభిప్రాయమని పేర్కొన్నారు. భారతీయులుగా గర్విద్దాం, 75 ఏండ్ల పండుగలో భాగస్వాములమవుదాం, జాతీయ స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదామని మంత్రి సూచించారు.
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. జాతీయ జెండా ఎగురవేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. అనేక మంది అమరుల త్యాగఫలితంతోనే నేడు మనం స్వేచ్ఛా గాలులు పీల్చుకుంటున్నామన్నారు. వారిని స్మరించుకుంటూ వజ్రోత్సవాలను విజయవంతం చేద్దామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికి చేరడంలో భాగంగానే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. పెద్దఎత్తున వజ్రోత్సవాలు నిర్వహించడం, అందులో భాగస్వాములవడం మన అదృష్టమని చెప్పారు.
వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలు స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై గర్వంగా జెండా ఎగురవేద్దామన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సబితారెడ్డి జాతీయ జెండాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, డీఈవో రేణుకాదేవి, డీటీడబ్ల్యూవో కోటాజీ, డీఎస్సీడీవో మల్లేశం, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.