ఇబ్రహీంపట్నం రూరల్ : సీమాంధ్ర పాలకుల హయాంలో వెనుకబాటు తనానికి గురైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో నిలుపడం టీఆర్ఎస్తోనే సాధ్యమైందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రాయపోల్, దండుమైలారం, ముకునూరు గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా పల్లె పల్లెనా ప్రకృతి వనాలు ఏర్పాటు చేయించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందజేయడంతో పాటు ప్రతి గ్రామంలో ఏ వీదికెల్లినా సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీల ఏర్పాటు, ప్రతి గ్రామానికీ శ్మశాన వాటిక, వైకుంఠ ధామం, చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ఇంటింటికీ తడి, పొడి చెత్తబుట్టలు అందజేసి గ్రామాలను పరిశుభ్రమైన ఆహ్లాదకర వాతావరణంలో ముందుకు సాగుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో తీసుకున్న హరితహారం కార్యక్రమంతో ఏ గ్రామానికెల్లినా రోడ్లకి ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన పచ్చనిచెట్లు దర్శనమిస్తున్నాయి. గత ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరగటంతో రెండేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉంటున్నారు.
ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి..
ప్రభుత్వం ప్రతి గ్రామానికి అధిక నిధులు కేటాయిస్తున్నందున గ్రామాలను అభివృద్ధితో పాటు స్వచ్ఛతలో ముందుకు తీసుకుపోయేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడే అవకాశమున్నందున ఎప్పటికప్పుడు వీదులను శుభ్రం చేయడం, గోతుల్లో నిలిచిపోయిన నీటిని తొలగించడం, మురుగునీటి కాల్వలు శుభ్రం చేయించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులు, బ్లీచింగ్ పౌడర్ గ్రామాల్లోని వీదుల్లో, రోడ్ల వెంబడి చల్లించాలని ఆదేశించారు.
ముఖ్యంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, ఎంపీపీ కృపేష్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, సర్పంచ్లు రవణమోని మల్లీశ్వరి జంగయ్య, బల్వంత్రెడ్డి, శివరాల జ్యోతిరాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.