రంగారెడ్డి, మార్చి 14(నమస్తే తెలంగాణ) : ఎలాంటి పొరపాట్లు జరగకుండా పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక సంబంధిత పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో 239 పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా హాల్లోకి వెళ్లేముందు ప్రతి విద్యార్థిని తనిఖీ చేయాలన్నారు.
మొబైల్ ఫోన్లను అనుమతించవద్దని, హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడుపాలన్నారు. పరీక్ష కేంద్రంలో మొబైల్ డెస్ ఏర్పాటు చేయాలన్నారు. ఆశా వరర్తోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇన్వెజిలేటర్లు పరీక్ష సమయానికి ముందే రావాలని చివరిదాకా ఉండాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పటిష్టంగా పర్యవేక్షణ జరుపాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.