ఇబ్రహీంపట్నం, జనవరి 11 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆర్డీవోలు ఓటరుకు సంబంధించి వచ్చిన ఫామ్-7, ఫామ్-8 దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీవోలతో పార్లమెంట్ ఎన్నికలు, ధరణి సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలని సూచించారు. పేర్లు తొలగించిన వాటి విషయంలో సమగ్రంగా ఇంటింటి సర్వే చేపట్టాలని, డూప్లికేషన్లు లేకుండా చూడాలన్నారు. ఫామ్-8 ద్వారా మార్పులు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఇంకా ఎక్కడైనా కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ముఖ్యంగా 1450 పైచిలుకు ఓటర్లు కలిగిన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించాలని తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తూ అందుకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. ప్రజావాణిలో ధరణికి సంబంధించిన దరఖాస్తులు అధిక మొత్తంలో పెండింగ్ ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించవద్దన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.