యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని దర్పల్లి గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన నాయిని రాంరెడ్డి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బిల్లులు చెల్లించలేక అవస్థలు పడుతున్న ఆయనకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో రూ. 60,000 చెక్కును బుధవారం ఆయన బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సిరెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే మండలంలోని ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుందన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎండీ షమీమ్, శ్రీనివాస్, పవన్, విక్రమ్, సురేందర్రెడ్డి, చంద్రయ్య, కుమార్ పాల్గొన్నారు.