రంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో నేటి నుంచి ఉచిత కోచింగ్
ప్రతి రోజూ 150 నుంచి 200 మంది పోటీ పరీక్షలకు సన్నద్ధం
బడంగ్పేట, జూలై 12: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం అధ్యయన కేంద్రంగా మారింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గ్రంథాలయాన్ని బడంగ్పేటలో ఏర్పాటు చేయించారు. నూతన హంగులతో నిర్మాణం చేసిన భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 150 నుంచి 200ల వరకు చదువుకోవడానికి వస్తున్నట్లు గ్రంథ పాలకులు పేర్కొంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరం అయిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు చదువుకోవడానికి ఫర్నిచర్తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఉచిత కోచింగ్ సెంటర్..
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలు రాసే వారి కోసం మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం, అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. నేటి నుంచి ఉచిత కోచింగ్ ప్రారంభం కానున్నది. కోచింగ్కు వచ్చే వారికి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఎస్ఐ ఉద్యోగమే లక్ష్యం
ప్రతి రోజు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నాను. ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను. గతంలో కర్మాన్ఘాట్ గ్రంథాలయానికి పోయి చదువుకునే వాడిని. గ్రంథాలయంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉదయ 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చదువు కుంటున్నాను. – వెంకటేశ్
గ్రూప్స్కు ప్రిపేరవుతున్నా..
గ్రూప్1, గ్రూప్2 సాధించాలన్న లక్ష్యంతో చదువుతున్నాను. ప్రస్తుతం చాలా వరకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు కావాలి. గ్రంథాలయంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. – శివకుమార్
సౌకర్యాలు కల్పిస్తున్నాం
పాఠకులకు అవసరం అయిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతాం. ప్రతి రోజు గ్రంథాలయానికి 150 నుంచి 200 మంది గ్రంథాలయానికి వస్తున్నారు. పోటీ పరీక్షల కోసం వచ్చి చదువు కుంటున్నారు. ఇప్పటికే ఫర్నిచర్ వచ్చింది. పాఠకులకు అవసరం అయిన సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– జైహింద్, గ్రంథ పాలకులు