చేవెళ్ల రూరల్ : గత జూన్ మాసంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద కంది ఎల్ఆర్జీ-52 కొత్త వంగడానికి సంబంధించిన 8.96 క్వింటాళ్ల విత్తనాలు చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల రైతులకు వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. అందులో భాగంగా మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు చేవెళ్ల మండలంలోని ఏరోనికోట, ఊరెళ్ల గ్రామాల్లో పర్యటించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ (డీవోడీ) అధికారి మనోహర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్లు శ్రీకాంత్, పరేశ్ హాజరై కంది ఎల్ఆర్జీ-52 కొత్త వంగడం పెరుగుదల, అధిక దిగుబడులు సాధించేలా రైతులకు సలహాలు, సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంది ఎల్ఆర్జీ-52 కొత్త వంగడం ముందునుంచే పెరుగుదలతో ఉన్నదని, రైతులు ఒక ఎకరాకు ఆరు క్వింటాళ్లు కంది పంటను ఆశించవచ్చని, దిగుబడికి సంబంధించిన సమాచారాన్ని వ్యవసాయ అధికారులకు అందించాలన్నారు. అనంతరం చేవెళ్ల రైతు వేదికను సందర్శించి ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ఏడీఏలు సత్యంబాయి, రమాదేవి, డీడీఏ మాధవి, ఏడీఏ పద్మజ, మండల వ్యవసాయ అధికారి కృష్ణమోహన్, ఏఈవోలు స్వాతిప్రియ, వరుణ్కుమార్, రమేశ్ పాల్గొన్నారు.