కడ్తాల్ : హైనా దాడిలో దూడ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన గంటి శ్రీనివాస్ రోజులాగే గురువారం సాయంత్రం తన పొలంలో పశువుల షెడ్డులో పశువులను కట్టెసి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం పాల కోసం శ్రీనివాస్ పొలం వద్దకి వెళ్లి చూడగా పశువుల షెడ్డులో ఆవు దూడ గాయాలతో మృతి చెంది పడి ఉన్నది. దూడ మృతి చెందిన విషయాన్ని చుట్టు పక్కల ఉన్న రైతులతో పాటు గ్రామస్తులకు తెలుపడంతో, అక్కడికి చేరుకున్న వారు దూడను చిరుతపులి చంపిందా, మరేదైనా జంతువు చంపిదేమో అని అనుమానంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఏక్వాయిపల్లి గ్రామానికి చేరుకున్న అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ సిబ్బందితో కలిసి శ్రీను పొలం వద్ద దూడను పరిశీలించి, పరిసరాలలో కనిపించిన ఆనవాళ్లు గుర్తించి, దూడను చంపింది హైనా అని నిర్ధారించారు. హైనా దాడిలో మృతి చెందిన ఆవు దూడకు నష్టపరిహారం అందజేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.