షాద్నగర్ : మహేశ్వరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారంగా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. మిషన్భగీరథ పథకం ద్వారా ఇప్పటికే ఇంటింటికీ నల్లాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పది గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, పైపులైన్ల కోసం మరో రెండు కోట్లను మంజూరు చేశామన్నారు. ఈ పనులు 45రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శిథిలావస్థలో ఉన్న ట్యాంకుల స్థానంలో కొత్త వాటితో పాటు అవసరం ఉన్న చోట నూతనంగా ట్యాంక్లు నిర్మించున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామంలో రూ. 22లక్షలు, పోరండ్ల, గంగారాం తండాలో రూ. 20లక్షలు, నాగారంలో రూ. 12లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా కందుకూర్ మండలంలో కందుకూర్ గేటు వద్ద రూ. 29లక్షలు, కొత్తగూడ గ్రామంలో పోచమ్మ దేవాలయం వద్ద రూ. 20లక్షలు, పద్మావతికాలనీ రూ. 12లక్షలు, గూడూరు గ్రామంలో రూ. 22లక్షలు, బాచూపల్లి, చిప్పలపల్లి గ్రామాల్లో రూ. 12లక్షల చొప్పున వెచ్చించి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించనున్నట్లు తెలిపారు.
రానున్న వేసవికాలంలోపు తాగునీటికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు.