మియాపూర్, ఏప్రిల్ 9 : సమయం దొరికేతే చాలు.. కొందరు విద్యార్థులు సెల్ఫోన్లు, మాటల్లో నిమగ్నమై సమయాన్ని వృథా చేస్తుంటారు. అలాంటి వ్యాపకాలకు చెక్ పెట్టేందుకు హైదర్గూడలోని రిషి మహిళా డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాల నిర్వాహకులు సరికొత్త ఆలోచన చేశారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం కళాశాలలో ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులు తోటి స్నేహితులతో అక్కడికి వెళ్లి ఎంచక్కా వ్యాయామం చేస్తున్నారు.
విశేష స్పందన
కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్కు విద్యార్థినుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఉదయం కళాశాల తెరిచింది మొదలు సాయంత్రం తిరిగి తాళాలు వేసేంత వరకూ జిమ్ కిటకిటలాడుతున్నది. జిమ్ను అందుబాటులోకి తీసుకువచ్చిన నాటి నుంచి విద్యార్థినులు ఫోన్లతో సమయాన్ని వృథా చేసే పరిస్థితి కొంత మేర తగ్గిందని కరస్పాండెంట్ రాజశ్రీ పేర్కొన్నారు.
ఉత్సాహంగా అనిపిస్తుంది
సమయం దొరికినప్పుడల్లా ఓపెన్ జిమ్లో గడుపుతున్నాం. వ్యాయామం చేస్తున్నంత సేపు ఉత్సాహంగా అనిపిస్తుంది. కొన్ని సార్లు వాటి కోసం మా మధ్య పోటీ సైతం నెలకొంటుంది.
– శ్రీలత, విద్యార్థిని
కుస్తీ పడుతున్నాం..
ఖాళీ సమయంలో ఓపెన్ జిమ్లో పరికరాలతో కుస్తీ పడుతున్నా. చాలా యాక్టివ్గా అనిపిస్తున్నది. సెల్ఫోన్లో తలమునకలై ఉండే ఎందరో నాలాంటి విద్యార్థినులు జిమ్ అందుబాటులోకి వచ్చాక ఆ అలవాటును క్రమంగా తగ్గించుకున్నారు.స్నేహితులతో కలిసి పరికరాలపై వ్యాయామాలు చేస్తున్నా.
– శ్రీనిధి, విద్యార్థిని
సమయం దొరికినప్పుడల్లా..
నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరం. అందులోనూ ఎదుగుతున్న విద్యార్థినులకు ఇది మరింత అవసరం. అందుకే మా కళాశాల ఆవరణలోనే ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయించారు. కసరత్తులు చేసేందుకు పది రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థినులు తరగతుల నడుమ సమయం దొరికినప్పుడల్లా జిమ్లోకి వచ్చి శక్తిమేర వ్యాయామం చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
రోడ్ల నిర్మాణానికి రూ.7.33కోట్ల నిధులు మంజూరు
పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలి